Vande Bharat train : వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా రైలులో మంటలు చెలరేగాయి. సీ-14 కోచ్ వద్ద మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రయాణికులు కోచ్ నుంచి బయటకు పరుగు తీశారు.
సోమవారం ఉదయం వందే భారత్ ఎక్స్ ప్రెస్ భోపాల్ నుంచి ఢిల్లీ బయలుదేరింది. రాణికమలాపాటి స్టేషన్ నుంచి ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కుర్వాయి స్టేషన్ వద్ద రైలులోని బ్యాటరీ నుంచి మంటలు వచ్చాయి. వెంటనే రైల్వే సిబ్బంది మంటలను గుర్తించారు. లోకో పైలట్కు సమాచారం ఇచ్చి ప్రమాదంపై అప్రమత్తం చేశారు. దీంతో లోకో పైలట్ రైలును అక్కడే నిలిపివేశారు.
అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లోని సీ-14 కోచ్ లో చెలరేగిన మంటలను అదుపు చేశారు. రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.