Uttarakhand Tunnel : మరికొన్ని గంటల్లో 12 రోజులుగా చీకటిలో మగ్గిపోతూ.. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాద కార్మికులు వెలుగును చూడబోతున్నారు. వారిని కాపాడేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఫైనల్ స్టేజ్కు చేరుకుంది. సొరంగం ముందు నుంచి ఇప్పటికే 44 మీటర్ల వరకు డ్రిల్ చేసిన రెస్క్యూ టీమ్స్.. స్టీల్ రాడ్స్ అడ్డు తగలగడంతో నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన NDRF టీమ్ రాడ్స్ను తొలగించే పనిలో ఉంది. వీటిని తొలగించగానే అతి త్వరలోనే 41 మంది కార్మికులను బయటికి తీసుకురానున్నారు.
కార్మికులు టన్నెల్ నుంచి బయటికి రాగానే.. ఇన్ని రోజుల పాటు సొరంగంలో ఉన్న వారికి వైద్య సహాయం అందించాలని నిర్ణయించారు. ఇప్పటికే టన్నెల్ వద్దకు అంబులెన్స్లు చేరుకున్నాయి. కార్మికులకు చికిత్స చేసేందుకు 41 పడకలతో ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ సిలిండర్లను కూడా తీసుకొచ్చారు.
సొరంగం కూలిన ప్రాంతంలో గుట్టలుగా పేరుకుపోయిన శిథిలాల నుంచి డ్రిల్లింగ్ చేశారు. నిన్న రాత్రి వరకు 45 మీటర్ల లోపలికి డ్రిల్లింగ్ వేసింది. 6 మీటర్ల పొడవు కలిగి 800 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన మరో 2 స్టీల్ పైపులను సొరంగంలోకి పంపించేందుకు శిథిలాలను దాదాపు 12 మీటర్లు తవ్వాలని అధికారులు తెలిపారు.
మరోవైపు.. ఉత్తర కాశీ జిల్లాలోని అన్ని ఆస్పత్రులను అలర్ట్ చేశారు. వాటితో పాటు ఎయిమ్స్, రిషికేష్ ఆస్పత్రుల్లో కూడా బాధిత కార్మికులకు చికిత్స అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ నెల 12వ తేదీన సిల్క్యారా సొరంగం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ఘటనతో అందులో పనిచేస్తున్న 41 మంది కార్మికులు అక్కడే చిక్కుకుపోయారు. అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.