Building Collapses In Meerut: ఉత్తరప్రదేశ్లో విషాదం నెలకొంది. మీరట్లోని జాకీర్ కాలనీలో ఓ మూడంతస్తుల భవనం కూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా.. శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
భారీ వర్షాలు కురవడంతో భవనం కూలినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ భవనం శిథిలాల కింద చిక్కుకున్న 11మందిని రక్షించారు. ఈ ఘటనలో పలు జంతువులు కూడా చనిపోయాయి. కాగా, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు చెందిన బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఈ భవనం దాదాపు 35ఏళ్ల క్రితం నిర్మించగా..ఆ భవనం శిథిలావస్థకు చేరడంతోపాటు వర్షం కారణంగా కూలిపోయి ఉంటుందని రెస్క్యూ సిబ్బంది అనుమానిస్తున్నారు.
Also Read: సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనెల ధరలు!
ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతంగా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.