Narendra Modi America Visit(Telugu breaking news today): ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. మంగళవారం భారత్ నుంచి బయలుదేరారు. బుధవారం నుంచి యూఎస్ లో మోదీ అధికారిక పర్యటన మొదలవుతుంది. యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ తో వివిధ అంశాలపై చర్చలు జరుపుతారు. ముఖ్యంగా వాణిజ్యం ,పెట్టుబడులు, టెక్నాలజీ, టెలికాం, అంతరిక్షం, తయారీ రంగాలపైనా చర్చిస్తారు. విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి వినయ్ మోహన్ ఖ్వాత్రా ప్రధాని మోదీ అమెరికా పర్యటన వివరాలను వెల్లడించారు. రక్షణ రంగంలో పరస్పర సహకారం దిశగా భారత్, అమెరికాలు మరిన్ని ముందడుగులు వేయనున్నాయని తెలిపారు.
మోదీ అధికారిక పర్యటన జూన్ 21న న్యూయార్క్ నుంచి మొదలవుతుంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మోదీ పాల్గొంటారు. అక్కడ పలువురు ప్రముఖులను కలుస్తారు. అదే రోజు సాయంత్రం వాషింగ్టన్ చేరుకుంటారు. అక్కడ బైడెన్ దంపతులు ఇచ్చే విందులో పాల్గొంటారు. జూన్ 22న మోదీకి శ్వేతసౌధంలో బైడెన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. సాయంత్రం అధికారిక విందుకు మోదీ హాజరవుతారు.
అమెరికా ప్రభుత్వం ఇచ్చే అధికారిక విందుకు 400 మంది అతిథులు హాజరయ్యే అవకాశముందని సమాచారం. ఇందులో ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు అమీ బెరా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, శ్రీ థనేదార్ ఉన్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ సీఈవోలు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, ఫెడెక్స్ నుంచి రాజ్ సుబ్రమణియం విందుకు హాజరుకానున్నారు. జూన్ 23న కొందరు సీఈవోలతో భారత్ ప్రధాని భేటీ అవుతారు. ఆ తర్వాత అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఇచ్చే విందులో పాల్గొంటారు.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ప్రవాస భారతీయులు వాషింగ్టన్ లింకన్ మెమోరియల్ వద్ద ర్యాలీ చేపట్టారు.మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. హ్యూస్టన్లోని సుగర్లాండ్ మెమోరియల్ పార్కు వద్ద భారతీయ పతాకాలు రెపరెపలాడాయి. శాన్ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ వంతెన, న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
అమెరికా పర్యటన తర్వాత ప్రధాని మోదీ జూన్ 24న ఈజిప్టు వెళతారు.రెండు రోజులపాటు ఆ దేశంలో పర్యటిస్తారు. 11వ శతాబ్దం నాటి అల్ హకీం మసీదును సందర్శించనున్నారు.