Ram Chet: లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొన్న పరువు నష్టం కేసు విచారణలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్కు వెళ్లారు. వళ్లి వస్తుండగా సుల్తాన్పూర్ శివారులోని చెప్పుల దుకాణం వద్ద ఆగారు. చెప్పులు కుట్టే రామ్ చేత్తో మాట కలిపారు. కాసేపు ఆ చిన్ని దుకాణంలోనే కూర్చున్నారు. మాట్లాడుతూనే తాను కూడా షూస్ కుట్టాడు. ఆ తర్వాత రామ్ చేత్ ఫేమస్ ఐపోయాడు. సుల్తాన్పూర్ శివారులోని విధాయక్ నగర్లో ఆయన చెప్పుల దుకాణం ఉన్నది.
ఇప్పుడు అటువైపుగా వెళ్లినవారంతా రామ్ చేత్ వద్దకు వెళ్లి పలకరిస్తున్నారు. బైక్లు, కారులు ఆపి మరీ ఆయనతో మాట కలుపుతున్నారు. సెల్ఫీలు దిగుతున్నారు. ఆయన బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. స్థానిక అధికారులు ఆయన వద్దకు చేరి ఏవైనా సమస్యలు ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు. కొందరైతే రాహుల్ గాంధీ కుట్టిన షూస్ అమ్మాలని కోరుతున్నారు. రూ. 5 లక్షలైనా ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు. అయినా.. ఆయన తిరస్కరించడంతో ఇప్పుడు రూ. 10 లక్షలు కూడా ఇస్తామని చెబుతున్నారు. అయినా, రాహుల్ గాంధీ కుట్టిన షూస్ను తాను అమ్మబోనని స్పష్టంగా చెబుతున్నాడు. రాహుల్ గాంధీ గుర్తుగా ఆ షూస్ను తనతోపాటే ఉంచుకుంటానని వివరిస్తున్నాడు. స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయనకు మిషన్ కొనిచ్చారని, దానితో తన పని సులువు అవుతున్నదని చెప్పాడు.
Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపే జాబ్ క్యాలెండర్ ప్రకటన: మంత్రి పొంగులేటి
రూ. 10 లక్షలు ఇస్తామని చెబుతున్నా ఆ షూస్ అమ్మబోనని చెబుతున్నా రామ్ చేత్ మరో కీలక మాట చెప్పారు. రాహుల్ గాంధీ వచ్చి వెళ్లడం వల్ల తనకు గౌరవం పెరిగిందన్నాడు. చెప్పులు కుట్టుకునే రామ్ చేత్ గౌరవం కోసం ఎంత తపించాడో కదా అని కొందరు, ఇప్పటి వరకు ఆయన జీవితం ఎంతటి అంధకారంలో గడిచిందోనని ఇంకొందరు చర్చిస్తున్నారు. ఇది ఆత్మగౌరవ పంతమే అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఒక వేళ నిజంగానే రామ్ చేత్ ఆ షూస్ అమ్ముకుంటే ఆయన సమస్యలన్నీ తొలిగిపోయే అవకాశం ఉంటుంది. కానీ, ఆ పని చేయలేదు.
తన ఇంటికి కరెంట్ సదుపాయం లేకపోవడంతో కుమారుడి ఇంటి వద్ద ఆ మిషన్ పెట్టి చెప్పులు కుడుతున్నానని రామ్ చేత్ వివరించారు.