Vande Bharat express: భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఎంతో ఆదరణ లభించింది. దీంతో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇవి వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్)తో కలిసి ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్) వీటిని తయారు చేస్తోంది. వందే భారత్ స్లీపర్ తొలి ప్రొటోటైప్కు చెందిన కాన్సెప్ట్ ఫొటోలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
భారతీయ రైల్వే చరిత్రలో లిఖించదగ్గ స్థాయిలో ప్రయాణికులకు అనువైన రీతిలో వందే భారత్ స్లీపర్ కోచ్ ఫీచర్లు ఉంటాయని ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా వెల్లడించారు. ఆ విశేషాలు ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వందే భారత్ స్లీపర్ కొత్త రైళ్లలో 16 కోచ్లు ఉంటాయి. వాటిలో 11 ఏసీ-3 టైర్, మరో 4 ఏసీ-2 టైర్ కోచ్లు ఉంటాయి.
ఇవి కాకుండా మరొక ఫస్ట్ క్లాస్ కోచ్ కూడా ఉంటుంది. వందే భారత్ రైళ్ల మాదిరిగానే ఏసీ, ఆటోమేటెడ్ డోర్లు, వ్యాక్యూమ్ టాయిలెట్లు వంటి సదుపాయాలు ఉంటాయి. లోపలి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. సాఫ్ట్ లైటింగ్, అప్పర్ బెర్త్లు ఎక్కేందుకు అనువైన నిచ్చెన వంటి అనువైన సౌకర్యాలు అదనం.
టిటాగఢ్-బీహెచ్ఈఎల్ కన్సార్షియం 80 రైళ్లను, ఆర్వీఎన్ఎల్-టీఎంహెచ్ 120 రైళ్లను తయారు చేసే కాంట్రాక్టును దక్కించుకున్నాయి. ఐసీఎఫ్, బీఈఎంఎల్ కలిసి పది స్లీపర్ రైళ్లను తయారు చేస్తున్నాయి. డిజైనింగ్ను ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రూపొందించడం విశేషం.