Marriage: ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులు పాదయాత్ర చేయడం.. కోరిన కోర్కెలు తీర్చిన దేవుళ్ల ఆలయాల వరకు భక్తులు పాదయాత్ర చేయడం చూస్తుంటాం. కానీ పెళ్లి కావడం లేదని పాదయాత్ర చేయడం ఎక్కడా చూసి ఉండరు. ఇటువంటి విచిత్రయాత్రకు సిద్ధమయ్యారు కొందరు బ్రహ్మచారులు. ఈ ఘటన కర్నాటకలోని మాండ్య జిల్లాలో చోటుచేసుకుంది.
మాండ్య జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన మొత్తం 200 మంది బ్రహ్మచారులు ఈ విచిత్ర కార్యానికి శ్రీకారం చుట్టారు. వారంతా 30 నుంచి 33 ఏళ్లు ఉన్న బ్రహ్మచారులే. అందరికీ పది ఎరకాల వరకు పొలాలు ఉన్నాయి. ఆర్థికంగా స్థిరపడినప్పటికీ వారికి పిల్లను ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో సరైన వయస్సులో పెళ్లిళ్లు కావడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు.
ఈక్రమంలో ప్రముఖ శైవక్షేత్రం మలెమహదేవన బెట్టకు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 105 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయానికి వీరంతా కాలినడకన ఈ నెల 23న బయల్దేరి వెళ్లనున్నారు. ఈ యాత్రకు బ్రహ్మచారుల పాదయాత్రగా పేరుపెట్టారు. యాత్ర గురించి ప్రకటించగానే చాలా మంది పాల్గొనడానికి ఆసక్తి చూపారని నిర్వాహకులు తెలిపారు.