Rahul Gandhi: జోడోయాత్రలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు. రాహుల్ గాంధీ ప్రస్తుతం పంజాబ్ లో పాదయాత్ర చేస్తున్నారు. అసలే సున్నితప్రాంతం. ఇటీవల తరుచూ ఆయన యాత్రలో భద్రతా వైఫల్యాలు కనిపిస్తున్నాయి. రాహుల్ కు సెక్యూరిటీ పెంచాలంటూ కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి లేఖ కూడా రాసింది. ఇలాంటి సమయంలో జోడో యాత్రలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు వెంటరాగా.. రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ఉన్నట్టుండి ఓ వ్యక్తి రాహుల్ వైపు దూసుకొచ్చాడు. హఠాత్తుగా ఆయన్ను కౌగిలించుకున్నాడు. అంతే. భద్రతా సిబ్బంది ఒక్కసారిగా కంగు తిన్నారు. వెంటనే స్పందించారు. రాహుల్ ను హగ్ చేసుకున్న ఆ వ్యక్తిని వెనక్కి లాగేశారు. కాసేపు షాక్ కు గురైన రాహుల్.. ఆ వెంటనే మళ్లీ యథావిధిగా పాదయాత్ర కంటిన్యూ చేశారు.
రాహుల్ ను హగ్ చేసుకున్న వ్యక్తి కాంగ్రెస్ అభిమాని కాబట్టి సరిపోయింది.. అదే ఏ ఉగ్రవాదో అయి ఉంటే? ఇదే ప్రశ్న కాంగ్రెస్ శ్రేణులను కలవరపెడుతోంది. ఇది పక్కా భద్రతా లోపమే అంటూ మండిపడుతోంది. కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా.. సెక్యూరిటీ పెంచటం లేదంటూ తప్పుబడుతోంది. ఇప్పటికే దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను కోల్పోయామని.. గాంధీ కుటుంబానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనంటూ కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
రాహుల్ గాంధీకి కేంద్రం ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తోంది. ఎనిమిది మంది భద్రతా సిబ్బంది ప్రతిక్షణం ఆయన వెంటే ఉంటారు. అయినా, అనుమతి లేని వ్యక్తులు పాదయాత్రలో రాహుల్ సమీపం వరకూ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. త్వరలోనే భారత్ జోడో యాత్ర జమ్మూకశ్మీర్ లో ప్రవేశించనుంది. అత్యంత సమస్యాత్మక ప్రాంతం కావడంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.