Kanwar Yatra: ఉత్తర్ప్రదేశ్లో నిర్వహించే తీర్థ యాత్ర.. కన్వర్ యాత్ర మార్గం లో ఉన్న హోటళ్లు, తోపుడుబండ్లు, ధాబాలపై వాటి యజమానుల పేర్లు ప్రదర్శించాలంటూ ఇటీవల యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇలా హోటళ్ల బయట యజమానుల పేర్లు ప్రదర్శిచడం అనేది యజమాని మతాన్ని సూచించేందుకేనని.. సమాజ విభజన రాజకీయాలు చేయడమే ఈ ఆదేశాల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని ప్రతిపక్ష పార్టీలు యుపి ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.
ప్రతి పక్ష పార్టీలు సరే.. కానీ ఇప్పుడు కేంద్రలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న మిత్ర పార్టీలు కూడా ఈ ఆదేశాలపై విమర్శలు చేస్తున్నాయి. జేడీయూ, ఎల్జేపీ పార్టీలు ఇప్పటికే ఈ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయగా.. తాజాగా ఈ జాబితాలో ఆర్ఎల్డీ(రాష్ట్రీయ లోక్దళ్) కూడా చేరింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్రకు సంబంధించిన ఉత్తర్వులని ఉపసంహరించుకోవాలని కేంద్రమంత్రి, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌధరి డిమాండ్ చేశారు. కన్వర్ యాత్ర ఐకమత్యానికి ప్రతీక అని.. ఏ ఒక్క కులానికో, మతానికో చెందినది కాదన్నారు. యుపి ప్రభుత్వం ఉత్తర్వులు సమాజంలో విభజన తీసుకువచ్చే విధంగా ఉన్నాయని.. ఇవి అనాలోచిత ఉత్తర్వులని ఆయన తప్పుబట్టారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయంపై మొండిపట్టుతో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. సమయం ఉండగానే ఈ ఉత్తర్వులు ఉపసంహరించుకుంటే మంచిదని హితువు పలికారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి యోగి ప్రభుత్వం వెనక్కు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
Also Read: ప్రత్యేక హోదాకు జేడీయూ డిమాండ్.. టీడీపీ సైలెంట్!
ఎన్డీయే భాగస్వామ్య పార్టీ అయిన లోక్ జనశక్తి, జనతాదళ్ యునైటెడ్ కూడా ఈ ఉత్తర్వులను ఖండించింది. మతం, కులం ఆధారంగా ప్రజలను వేరుచేసే నిర్ణయాలను తమ పార్టీ ఎప్పుడూ సమర్థించడం జరగదని.. పార్టీ అధ్యక్షడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ స్పష్టం చేశారు.
ఎన్డీయేలోని మరో భాగస్వామి, నితీష్ కుమార్కు చెందిన జేడీయూ నాయకుడు కూడా యుపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. జెడియు నేత కె.సి.త్యాగి మాట్లాడుతూ.. మత వైషమ్యాలను పెంచే విధంగా ఈ ఉత్తర్వులున్నాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని సత్వరమే మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
కన్వర్ యాత్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటరానితనమనే వ్యాధిని వ్యాప్తి చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి, బిజేపీ సీనియర్ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు వర్గ వైషమ్యాలను ప్రొత్సహించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమన్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సైతం ఈ ఉత్తర్వులను తీవ్రంగా ఖండిస్తూ.. ఇటువంటి ఉత్తర్వులను జారీ చేసిన అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు.