తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి కొత్త వివాదానికి తెరలేపారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఉదయనిధి తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘సనాతన నిర్మూలన’ అనే అంశంపై సదస్సు నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని విమర్శించారు. సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదని.. పూర్తిగా తొలగించాలని వివాదస్పద కామెంట్స్ చేశారు. సనాతన ధర్మాన్ని తిరోగమన సంస్కృతిగా పేర్కొన్నారు. ప్రజలను కులాలు పేరిట విభజించిందని ఆరోపించారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకతమని ఉదయనిధి తీవ్ర విమర్శలు చేశారు.
ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ , హిందూ సంస్థలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఉదయనిధిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విపక్షాల కూటమి హిందుత్వాన్ని అవహేళన చేస్తోందని ఆరోపించారు.
దేశ వారసత్వంపై దాడికి పాల్పడుతోందని విమర్శించారు. ఇండియా కూటమి తరఫునే ఉదయనిధి స్టాలిన్ ఆ వ్యాఖ్యలు చేశారన్నారు. ఉదయనిధి కామెంట్స్ ను కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తనయుడు కార్తి చిదంబరం సమర్థించడాన్ని అమిత్ షా తప్పుబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తున్నారన ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ మోదీ గెలిస్తే దేశంలో సనాతన పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
తమిళనాడులో కొంత మంది నిజస్వరూపం ఇప్పుడు బయటపడుతోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల నిర్వహించిన కాశీ, తమిళ సంగమం కార్యక్రమాన్ని తమిళనాడులోని ప్రతి గ్రామం ఆదరించిందని వివరించారు. సనాతన ధర్మం శాశ్వతమైనదని స్పష్టం చేశారు. ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలతో ఏమీ జరగదన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ‘ఇండియా’ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నారని అందుకే తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారనిన ప్రజలు గమనిస్తున్నారన్నారు.
మరో బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ అన్నారు. అలాగే కాంగ్రెస్ సహా విపక్షాల కూటమిలోని ఇతర పార్టీలు ఉదయనిధి కామెంట్స్ పై తమ వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు.దేశంలో సనాతన ధర్మాన్ని ఆచరించే 80 శాతం ప్రజల్ని చంపేయాలనేలా.. ఉదయనిధి వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ నేత అమిత్ మాల్వీయ ట్వీట్ చేశారు.
బీజేపీ నేతలపై విమర్శలపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మంపై చేసిన ప్రతీ మాటకు కట్టుబడే ఉన్నానని ట్వీట్ చేశారు సనాతన ధర్మాన్ని పెకలించి వేస్తేనే మానవత్వం పరిమళిస్తుందన్నారు. సనాతన ధర్మాన్ని కొవిడ్, డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు.కోర్టుల్లోనూ తేల్చుకోవడానికి రెడీ అన్నారు.