Uddhav Thackeray: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయనకు గుండె సంబంధిత సమస్య తలెత్తినట్లుగా సమాచారం. ఈ క్రమంలో ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. గత ఆదివారం ఆయన ముంబైలో విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ… శివసేన యూబీటీ రానున్న ఎన్నికల్లో పాల్గొంటుందని చెప్పారు. త్వరలోనే తమ పార్టీ తరఫున సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తామని పేర్కొన్నారు. కానీ, అంతకంటే ముందు అధికారంలో ఉన్న కూటమి మహాయుతి ముందుగా తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో బీజేపీ నేతల పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారయ్యిందన్నారు. వారంతా కూడా ద్రోహుల నాయకత్వంలో పోటీ చేయనున్నారంటూ ఎద్దేవా చేశారు.
Also Read: ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం షురూ… నోటిఫికేషన్ ఎప్పుడంటే ?
ఇదిలా ఉంటే… మహారాష్ట్రలో ఎన్నికలు రాబోతున్నాయి. మహారాష్ట్రతోపాటు జార్ఖండ్ రాష్ట్రానికి కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం ఎన్నికల హడావుడి నెలకొని ఉంది. రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తు ఇప్పటి నుంచే వేస్తున్నాయి. రాజకీయ నేతల సభలు, సమావేశాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. ఏ నేతను చూసినా బిజీ బిజీగా కనిపిస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చేదే ఆలస్యం.. పూర్తిగా ఎన్నికల సమరానికి సిద్ధమయ్యేందుకు ముందడుగులు వేస్తున్నారు.
కాగా, ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే వారం ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో నవంబర్ మూడో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేస్తున్నట్లు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత.. కేంద్రం గెజిట్ రిలీజ్
ఈ రెండు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చాలా స్థానాల్లో ఈసీ బైపోల్స్ నిర్వహించనున్నదని సమాచారం. పలు రాష్ట్రాల్లోని దాదాపు 45 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 2 లోక్ సభ స్థానాలకు ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించనున్నారని తెలుస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా మరో మినీ సార్వత్రిక ఎన్నికల సమరం కానున్నదనే చెప్పాలి. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు.. ఎన్నికల సమరంలో పాల్గొనేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నాయి.