Uddav Thackeray fire Shinde govt woman schemes: శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ థాక్రే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల మీటింగ్ లో ఉద్ధవ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుతమున్న ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని ఏక్ నాథ్ షిండే సర్కారు మహిళల కోసం ప్రకటిస్తున్న పథకాలపై ఆయన మండిపడ్డారు. ఆ స్కీములన్నీ కూడా త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత మూలకు పడేసే స్కీములంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అత్యవసరంగా చాలా పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఇది కేవలం ఎన్నికల ముందు మహిళల ఓట్ల కోసం చేసే రాజకీయ స్టంట్ మాత్రమే అంటూ ఆయన ఫైరయ్యారు. ఆ స్కీములు రెండు మూడు నెలలు మాత్రమే ఉంటాయన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చినా.. రాకపోయినా ఆ స్కీములను అమలు చేయరన్నారు.