AAP : జైలుకెళ్లిన ఇద్దరు మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా చేయడంతో వారి స్థానాలను భర్తీ చేసేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కసరత్తు చేశారు. కేబినెట్లోకి కొత్తగా ఇద్దరిని తీసుకోవాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు ఆతిషీ, సౌరభ్ భరద్వాజకు మంత్రులుగా అవకాశం కల్పించనున్నారు. కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడానికి కార్యాచరణను ఇప్పటికే రెడీ చేశారు. ఈ సమాచారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు పంపించారు.
ఇన్నాళ్లు ఆప్ లో కేజ్రీవాల్ తర్వాత స్థానం మనీశ్ సిసోడియాదే. డిప్యూటీ సీఎంగా 18 శాఖల బాధ్యతలు నిర్వహించారు. సీబీఐ అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం జైలులో ఉన్నారు. అలాగే ఆరోగ్యశాఖ మంత్రిగా సత్యేంద్ర జైన్ పనిచేశారు. కొంతకాలంగా ఆయన కూడా జైలులోనే ఉన్నారు. వారిద్దరూ ఇప్పుడు రాజీనామా చేయడంతో మరో ఇద్దరిని మంత్రివర్గంలోకి కేజ్రీవాల్ తీసుకుంటున్నారు.
రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రాసిన లేఖలో మనీశ్ సిసోడియా పలు విషయాలను ప్రస్తావించారు. ఎనిమిదేళ్లుగా నిజాయితీగా పనిచేస్తున్నానని తనపై ఉన్న ఆరోపణలన్నీ వాస్తవాలు కాదని స్పష్టం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ స్వచ్ఛమైన రాజకీయాలకు భయపడి కొందరు బలహీనులు పిరికితనంతో కుట్ర చేశారని పేర్కొన్నారు. వారి అసలైన టార్గెట్ కేజ్రీవాలేనని అన్నారు. కేవలం ఢిల్లీలోనేకాదు దేశ ప్రజలు కేజ్రీవాల్ ను గొప్ప నేతగా చూస్తున్నారని ప్రశంసించారు. సరికొత్త విధానాలతో ప్రజల్లో మార్పు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు.. ఢిల్లీ సీఎం సామర్థ్యాలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందని ఆ లేఖలో పేర్కొన్నారు.
కేజ్రీవాల్ కు రాసిన లేఖలో తన తండ్రి గురించి సిసోడియా ప్రస్తావించారు. విద్య గురించి ఆయన రాసిన మంచి మాటలతో కూడిన చిత్రాన్ని రోజూ ఉదయం లేవగానే చూస్తానని తెలిపారు. తల్లిదండ్రులు పెంపకం వల్లే తనలో విలువలు ఉన్నాయన్నారు. ఏ శక్తి తనను నిజాయితీ లేని వ్యక్తిగా మార్చలేదని స్పష్టం చేశారు.