CM Yogi Adiyanath: అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంతో పాటు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను పేల్చివేస్తామంటూ.. ఇద్దరు నిందితులు బెదిరించారు. కొద్దిరోజుల్లోనే రామమందిరంలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరగనున్న వేళ ఇలాంటి బెదిరింపులు రావడం కలకలం రేపాయి. సీఎంను చంపేస్తామని బెదిరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించి.. అరెస్ట్ చేశారు.
ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు నిందితులిద్దరూ సోషల్ మీడియా వేదికగా బెదిరింపుల పోస్టు పెట్టారని తెలిపారు. సీఎంతో పాటు ఎస్టీఎఫ్ చీఫ్ అమితాబ్ యశ్ ను కూడా హత్య చేస్తామని హెచ్చరించారు. పోస్టు ఆధారంగా నిందితులకు సంబంధించిన మెయిల్ అడ్రస్ లను కనుగొన్నారు. సాంకేతిక నిపుణుల ద్వారా నిందితులను ఓం ప్రకాశ్, తాహర్ సింగ్ లుగా గుర్తించి.. వారిద్దరిని వెంటనే అరెస్ట్ చేశారు. గోండాకు చెందిన ఈ ఇద్దరూ పారామెడికల్ ఇనిస్టిట్యూట్ లో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.