Twitter: మోడీ ప్రభుత్వం, భారత్లో ప్రజాస్వామ్యంపై ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయ్. రైతులు నిరసనల సమయంలో భారత్ ప్రభుత్వం తమను తీవ్ర ఒత్తిడికి గురి చేసిందని ఆరోపించారు. రైతుల నిరసనలపై వస్తున్న సానుకూల స్పందనలను ట్విట్టర్ నుంచి తొలగించాలని.. లేదంటే ఇండియాలో ట్విట్టర్ను మూసేస్తామంటూ మోడీ ప్రభుత్వం హెచ్చరించిందని ఆయన ఆరోపణలు చేశారు. అలాగే ఉద్యోగుల ఇళ్లపై రైడ్లు నిర్వహిస్తామని బెదిరించిందన్నారు. కొందరిపై రైడ్స్ చేశారని ఆరోపించారు. ఇది ఇండియా.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమంటూ కామెంట్స్ చేశారు జాక్ డోర్సే. ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయ్. విపక్షాలు.. మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోవైపు జాక్ డోర్స్ కామెంట్స్ కు కౌంటరిచ్చారు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్. జాక్ డోర్సే చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలన్నారు. ట్విట్టర్ చాలా సార్లు భారత్ చట్టాలను ఉల్లంఘించిందని గుర్తు చేశారు. ఈ విషయంపై హెచ్చరిస్తే.. ఇలాంటి మోసపూరిత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఎవరీపై రైడ్స్ చేసి జైలుకు పంపలేదని స్పష్టం చేశారు రాజీవ్ చంద్రశేఖర్.
2020లో మూడు వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టింది కేంద్రం. దీనికి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. లక్షలాది మంది రైతులు ఉద్యమించారు. 2021 నవంబర్ వరకు ఆందోళనలు కొనసాగాయి. రైతులకు సామాజిక మాధ్యమాల్లో దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. చివరికి దిగొచ్చిన ప్రభుత్వం.. రైతు చట్టాలను ఉపసంహరించుకుంది.