Kalyan Banerjee Injury: ఆ ఎంపీ చేతితో గాజు సీసా పగులగొట్టారు. అదేదో పోటీలలో పాల్గొని పగలగొట్టి, బహుమతి అందుకున్నారని అనుకుంటే పొరపాటే. ఇక్కడ అలా జరగలేదు కానీ, సీసా పగలగొట్టినందుకు ఏకంగా, పార్లమెంటరీ కమిటీ నుండి సస్పెండ్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇంతకు ఆ ఎంపీ ఎవరు? అసలేం జరిగిందనే విషయాలు తెలుసుకుందాం.
ఏదైనా పార్లమెంట్ బిల్లుకు సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కమిటీకి సంబంధించిన సభ్యులు చర్చించడం సర్వసాధారణం. అదే రీతిలో ఢిల్లీలో మంగళవారం జరిగిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఓ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తన కోపాన్ని గాజు సీసాపై చూపగా.. చివరికి ఆయన చేతికి గాయాలైన పరిస్థితి. ఈ ఎంపీకి కోపం రావడానికి కారణాలు ఏవైనా.. చివరికి చేతికి కట్టు కట్టుకునే స్థాయిలో దెబ్బ తగిలిందట.
వక్ఫ్ సవరణ బిల్లు 2024 గురించి ఢిల్లీలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్. సమావేశంలో అందరి అభిప్రాయాలను తెలుసుకుంటుండగా, ప్రతిపక్ష ఎంపీలకు, అధికారపక్ష బీజేపీ ఎంపీల మధ్య పరస్పర ఆరోపణలు సాగాయి.
అయితే ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, అభిజిత్ గంగోపాధ్యాయాల మధ్య మాటల వేడి కాస్త పెరిగింది. ఇక అంతే కోపం వచ్చింది.. వెంటనే తన పక్కనే గల గాజు వాటర్ బాటిల్ ని చేతబట్టిన బెనర్జీ దానిని ఒంటి చేత్తో పగలగొట్టేశారు. ఈ ఘటనతో సమావేశంలో పాల్గొన్న ఎంపీలు అందరూ షాక్ తిన్నారు. అంతలోనే బెనర్జీ చేతికి గాయమైనట్లు గమనించిన, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా ఎంపీ బెనర్జీ వెంట వెళ్లి చికిత్స అందేలా చూశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారిగా ఎంపీలు చర్చించుకున్నారు. అయితే సాక్షాత్తు జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో బెనర్జీ చేసిన నిర్వాకంపై, పార్లమెంటరీ కమిటీ నుండి సస్పెండ్ చేసినట్లుగా సమాచారం. ఎంతైనా తన కోపమే తనకు శత్రువు అంటే ఇదేనేమో అంటూ సోషల్ మీడియాలో ఎంపీ తీరు పట్ల కామెంట్స్ వినిపిస్తున్నాయి.