Transformer Blast: నదిపై ఓ వంతెన నిర్మిస్తున్నారు. ఆ పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఉన్నట్టుండి అది ఒక్కసారిగా బాంబులా పేలిపోయింది. అంతే. 15మంది వరకు స్పాట్ డెడ్. మృతుల్లో ఓ పోలీస్ సబ్ఇన్స్పెక్టర్, ఐదుగురు హోంగార్డులు కూడా ఉన్నారు. ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. అసలేం జరిగిందంటే…
ఉత్తరాఖండ్లో జరిగిన ఘోర ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. చమోలీ జిల్లాలో అలకనందా నది ఒడ్డున ఉన్న ఓ ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలింది. శివారులోని ఓ పంపింగ్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
రెయిలింగ్కు విద్యుత్ సరఫరా జరగడం వల్లే ట్రాన్స్ఫార్మర్ పేలిందని అంచనాకు వచ్చారు. ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించారు.
విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.