Khedkar’s UPSC Candidature under scrutiny: పుణె వివాదాస్పద ట్రైయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కెరియర్ ప్రస్తుతం చిక్కుల్లో పడింది. ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అదనపు మనోజ్ ద్వివేది దర్యాప్తును ప్రారంభించారు. రెండు వారాల్లో ఆయన ఓ నివేదికను ఇవ్వనున్నారు.
ఒకవేళ ఆ దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే పూజా ఖేద్కర్ ను సర్వీసు నుంచి తొలగించే అవకాశముందంటూ విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా నిజాలు దాటిపెట్టి, తప్పుడు మార్గంలో ఉద్యోగంలో చేరినందుకు ఆమెపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.
పుణెలో విధులు నిర్వరిస్తున్న ఖేద్కర్ పై ఆరోపణలు రావడంతో ఆమెను వాసిమ్ కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. తన ప్రైవేట్ ఆడి కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నెంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడటంతో వివాదం మొదలయ్యింది. తీగ లాగితే డొంక కదలినట్టుగా అప్పటి నుంచి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలు, సెటిల్మెంట్ లు, ఇతర అధికారులపై ఒత్తిడి చేయడం.. ఇలా ఒక్కొక్కటీ బయటకొస్తున్నాయి.
చివరకు ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. తనకు నేత్ర, మానసిక సమస్యలు ఉన్నాయంటూ యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్ లో ఖేద్కర్ పేర్కొన్నారు. 2022 ఏప్రిల్లో మొదటిసారిగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి ఆ వైద్య పరీక్షలకు వెళ్లలేదు.
ఆ తరువాత కూడా పలుమార్లు నెలలపాటు వైద్య పరీక్షలకు ఆమె హాజరుకాలేదు. చివరికి ఆరోసారి పిలుపు రావడంతో.. పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. అయితే, దృష్టి లోపాన్ని అంచనా వేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్ మెంట్ ఏదోరకంగా పూర్తయ్యింది. ఆ తరువాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్ లో సవాలు చేయగా, 2023 ఫబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.
Also Read: కర్ణాటక మాజీ మంత్రి అరెస్ట్.. మనీ లాండరింగ్ కేసు ఆరోపణలపై ఈడీ విచారణ
అయినా కూడా తన నియామకాన్ని కన్ ఫర్మ్ చేసుకుంది. ఇక పూజా ఓబీసీ ధృవీకరణ పత్రాలపైనా కూడా పలు వివాదాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ నివేదిక కీలకంగా మారనున్నది. ఈ నివేదికను బట్టే పూజా ఖేద్కర్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.