Kedarnath Yatra: ఛార్ థామ్ యాత్రలలో ఒకటైన కేదార్ నాథ్ యాత్రలో విషాద ఘటన జరిగింది. కొండచరియలు విరిగి పడటంతో ముగ్గురు యాత్రికులు మృతి చెందారు. గౌరీకుండ్ – చిర్బాసా మధ్యలో కొండ చరియలు విరిగి పడటంతో ముగ్గురు భక్తులు మరణించగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక వ్యక్తిని రుద్రప్రయాగ్ జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు.
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడినవారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
గౌరీకుండ్ – కేదార్ నాథ్ ట్రెక్కింగ్ మార్గంలో ఉన్న చిద్వాసా ప్రాంతానికి సమీపంలో ఆదివారం ఉదయం సుమారు ఏడున్నర గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వర్ వెల్లడించారు. భారీ వర్షాలకు శిథిలాలు, కొండపై రాళ్లు విరిగిపడ్డాయని తెలిపారు. ఇప్పటికే భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. అధికారులు వాటిని పునరుద్ధరించేలా చర్యలు చేపట్టారు.