Madhya Pradesh : మధ్యప్రదేశ్ లో శ్రీరామ నవమి వేడుకల్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఇండోర్ లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ మందిర్లో ఈ ప్రమాదం జరిగింది. ఆలయంలో రామనవమి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో కొందరు భక్తులు కింద ఉన్న మెట్ల బావిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో 35 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆ సమయంలో కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి పైనున్న ఫ్లోరింగ్పై కూర్చున్నారు. దీంతో ఫ్లోరింగ్ కుంగి ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో చాలా మంది భక్తులు బావిలో పడిపోయారు. తొలుత స్థానికులు బాధితులను బయటకు తీసేందుకు యత్నించారు. కొందరిని రక్షించగలిగారు. ఈలోపు పోలీసులు, వైద్య సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. నిచ్చెన సాయంతో కొందరు భక్తులను బయటకు తీసుకొచ్చారు. ఇలా కొంత మందిని కాపాడారు. వారిలో చాలామందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 18 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు.
మోదీ దిగ్భ్రాంతి..
ఇండోర్ విషాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.