Manali : మంచు దుప్పటి కప్పుకున్న కొండలను.. మంచు కురిసే వేళల్లో చూడొద్దని ఎవరూ కోరుకోకుండా ఉంటారు చెప్పండి. కానీ అందరూ ఒకేసారి అలా కోరుకోవడమే ఇప్పుడు తలనొప్పిగా మారింది. క్రిస్మస్, ఇయర్ ఎండింగ్ కావడంతో అందరూ ఆఫీస్లకు సెలవులు పెట్టుకొని హిమాచల్ బాట పట్టారు.
దీంతో మనాలీ హైవే కార్లతో కిక్కిరిసిపోయింది. ఇటీవల భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న హిమాచల్కు పర్యాటకులు ఇలా పోటెత్తడం కలిసి వచ్చే అంశమే అయినా.. వారంతా ఇప్పుడు మనాలీ చేరుకునే సరికే వారు పెట్టుకున్న సెలవులు అయిపోయేలా ఉంది పరిస్థితి. కేవలం ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఏకంగా గంటన్నర సమయం పడుతుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూసుకోవచ్చు.
ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన అటల్ టన్నెల్ నుంచి నిన్న ఒక్కరోజే ఏకంగా 12 వేల వాహనాలు ప్రయాణించాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అటల్ టన్నెల్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం మైనస్ 12 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. పొగమంచు, వేల సంఖ్యలో పర్యాటకుల రాకతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలను క్లియర్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. అయితే పలు ప్రాంతాల్లో రోడ్డుపై మంచు పేరుకుపోవడంతో బైక్ల రాకపోకలను పోలీసులు అడ్డుకుంటున్నారు.
కసోల్, బంజర్స్ తీర్థన్ వ్యాలీ వంటి ప్రదేశాల్లో గత మూడు రోజుల్లో 55 వేల వాహనాలు రాకపోకలు సాగించాయి. న్యూఇయర్ వరకు ఇదే సీన్ కనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం మనాలీలో 90 శాతం హోటళ్లు బుక్ అయ్యాయనీ.. ఇప్పటికీ కూడా బుకింగ్స్ కొనసాగుతున్నాయని హోటల్ యజమానులు తెలిపారు.
ఒక్కసారిగా పర్యాటకుల తాకిడి భారీగా పెరగడంతో సిమ్లా పూర్తిగా సందడిగా మారింది. అక్కడి పార్కింగ్ ప్రాంతాలన్నీ పూర్తిగా నిండిపోవడంతో రోడ్లపైనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కొత్త సంవత్సర వేడుకల కోసం ఈ వారంలో లక్షకు పైగా వాహనాలు సిమ్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ట్విటర్ వేదికగా స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ వచ్చే పర్యాటకులకు ఆహ్వానం పలికారు.