Toll Gate: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచేశారు. గ్యాస్ బండపై బాదేశారు. అన్ని సర్వీసులను ప్రీమియం చేసేశారు. యూపీఐ పేమెంట్స్పైనా పైసా వసూల్ చేస్తున్నారు. ఇంకేం పెంచుతారులే అనుకుంటుండగా.. టోల్ ఛార్జీలు పెంచేసి వాహనదారులకు షాక్ ఇచ్చారు. మోదీ పాలనతో అన్నీ పెరుగుటయే కానీ.. తగ్గేదేలే .. అంటూ దేశ ప్రజలు పెదవి విరుస్తున్నారు.
దేశ వ్యాప్తంగా పెంచిన టోల్గేట్ చార్జీల బాదుడు ప్రారంభమైంది. వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతూ NHAI టోల్ తీత స్టార్ట్ చేసింది. అన్ని టోల్ప్లాజాల దగ్గర 5 శాతం ట్యాక్స్ పెరిగింది. ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ ఛార్జీలను సమీక్షిస్తుంటారు. ఇందులో భాగంగా ఈసారి కూడా టోల్ ఛార్జీలు పెంచేశారు. సింగిల్, డబుల్ ట్రిప్లతోపాటు నెలవారీగా జారీ చేసే పాసుల్లోనూ ఈ పెంపు ఉంటుంది.
ఇప్పటికే ఇంధన ధరలతో ట్రాన్స్పోర్టు ఖరీదుగా మారి.. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. అదనంగా టోల్ ఛార్జీలు కూడా తోడవడంతో.. ధరల పెరుగుదల మరింతగా ఉంటుందని అంటున్నారు. పెరిగిన టోల్ ఛార్జీలను ప్రయాణీకుల నుంచే వసూలు చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. టోల్ ఎంత పెరిగిందో.. అంతగా టికెట్ ఛార్జీలు పెంచారు. ఆ భారం ప్యాసింజర్ల మీదే మోపారు. టోల్ ఎఫెక్ట్ లారీల మీద, గూడ్స్ వాహనాల మీదా పడుతుంది. సరుకులు, వస్తువుల ధరలూ పెరగడం ఖాయం. టోల్ తీత మామూలుగా ఉండదు ముందుముందు.