ED: అనిల్ అంబానీ కుటుంబం చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది. వారిపై విదేశీ మారకపు ద్రవ్య నిర్వహణ చట్టం ఫెమాను ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో వివిధ సెక్షన్ల కింద తాజా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఈడీ విచారణకు రిలయన్స్ అడాగ్ ఛైర్మన్ అనిల్ అంబానీ హాజరయ్యారు. ఫెమా యాక్ట్ ను ఉల్లంఘించడంపై ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. అనిల్ అంబానీ ఇచ్చిన సమాధానాలను రికార్డు చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా అనిల్ అంబానీ సతీమణి టీనా అంబానీ ఈడీ విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం దక్షిణ ముంబైలోని ఈడీ కార్యాలయానికి ఆమె వచ్చారు. ఈ వారంలోనే అనిల్ అంబానీని మరోసారి ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.
విదేశాల్లో కొన్ని వెల్లడించని ఆస్తులు, నిధులు మళ్లింపు సంబంధించి అనిల్ అంబానీ ఫ్యామిలీని ఈడీ విచారిస్తోంది. రెండు స్విస్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.814 కోట్ల వివరాలను వెల్లడించలేదని ఈడీ పేర్కొంది. రూ.420 కోట్ల పన్ను ఎగ్గొట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నల్లధన నియంత్రణ చట్టం కింద గతేడాది ఆగస్టులో ఐటీ విభాగం అనిల్ అంబానీకి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులపై బాంబే హైకోర్టు సెప్టెంబర్ లో మధ్యంతర స్టే ఇచ్చింది. గతంలోనూ 2020లో అనిల్ అంబానీ ఈడీ విచారణకు హాజరయ్యారు. యెస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్పై దాఖలైన మనీలాండరింగ్ కేసులో అప్పట్లో అనిల్ అంబానీ కూడా ఈడీ ప్రశ్నించింది.