Karnataka : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీలో అసమ్మతి భగ్గుమంది. అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా పార్టీలో వివాదాన్ని రేపింది. 52 మంది కొత్త అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వడంపై రచ్చ జరుగుతోంది. టికెట్ రాని చాలామంది నాయకులు పార్టీకి గుడ్ బై కొడుతున్నారు. ఇప్పటికే సీనియర్ నేత లక్ష్మణ్ సావాది, మాజీ ఎమ్మెల్యే దొడ్డప్పగౌడ పాటిల్ పార్టీని వీడారు.
లక్ష్మణ్ సావాది మాజీ సీఎం బీఎస్ యడ్డ్యూరప్పకు అత్యంత విధేయుడు. బలమైన లింగాయత్ నాయకుల్లో ఒకరు. 2018 ఎన్నికల్లో ఓటమిపాలైనా ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుదారుల్ని ఆకర్షించడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వెళతారని ప్రచారం సాగుతోంది.
మరికొందరు పార్టీ నుంచి వెళ్లిపోతామంటూ హెచ్చరిస్తున్నారు. సలియా నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఎస్. అంగారా టికెట్ రాకపోవడంతో రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఆశావహుల మద్దతుదారులు బీజేపీ కార్యాలయం వద్ద ఆందళనలు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టార్ పేరు తొలి జాబితాలో లేదు. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. టికెట్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. మరి పార్టీలో రేగిన అసమ్మతి జ్వాలలను బీజేపీ అధిష్టానం ఎలా చల్లారుస్తుందో చూడాలి.