Ayodhya: యూపీలోని అయోధ్యలో రామజన్మభూమి కాంప్లెక్స్కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. గుర్తుతెలియని వ్యక్తి అయోధ్యలో నివాసం ఉంటున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తికి ఫోన్ చేసి రామజన్మభూమి కాంప్లెక్స్ను పేల్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ.. భద్రతను కట్టుదిట్టం చేశారు.
అయోధ్యలోని రాంలాలా సదన్కు చెందిన మనోజ్ కుమార్కు ఈ ఉదయం ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మరికొన్ని గంటల్లో శ్రీరామజన్మభూమి కాంప్లెక్స్ను బాంబుతో పేల్చేస్తామని బెదిరించి ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత మనోజ్ ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విఛ్ఛాఫ్ రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు.
నిందితుడి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాల్ ట్రాకింగ్ ఆధారంగా నిందితుడిని అతి త్వరలో గుర్తించి అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.
ఇక ఆలయ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేసి.. భక్తులకు రాములోరి దర్శనం కల్పిస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.