Modi’s schedule in America : ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా పర్యటనకు వెళ్లారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ప్రధాని మోదీకి ఇదే తొలి అమెరికా పర్యటన కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలుత న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జరగనున్న అంతర్జాతీయ యోగా వేడుకల్లో పాల్గొనబోతున్నారు. అనంతరం ప్రధాని మోదీ అసలు పర్యటన ప్రారంభంకానుంది.
పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. అమెరికా అధ్యకుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వాణిజ్యం, సాంకేతికత, సృజనాత్మకత, టెక్నాలజీ, టెలికం, అంతరిక్షం, తయారీ రంగాలపైన చర్చలు జరపనున్నారు. ఆయా రంగాల్లో ఇరు దేశాల సహాయసహకారాలు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చర్చించనున్నారు. ఇక ప్రతిష్టాత్మక అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. గతంలో ట్రంప్ హయాంలో అమెరికన్ కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడిన మోదీ.. ఈ ఘనత సాధించిన తొలి భారత ప్రధానిగా రికార్డు సృష్టించారు.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. ప్రపంచంలోనే అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్తో సమావేశం కానున్నారు. ట్విటర్ ను దక్కించుకున్న తర్వాత.. ఇరువురు భేటీ కావడం ఇదే తొలిసారి. అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ.. ఎలాన్ మస్క్తో భేటీ అవ్వనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ భేటీలో టెస్లా కార్ల తయారీ, విక్రయం, పన్ను, విడిభాగాల దిగుమతి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఒకవేళ టెస్లా ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే..ఇదే పర్యటనలోనే దీనిపై ఒప్పందం జరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, రచయిత, సైన్స్ కమ్యూనికేటర్ ‘నీల్ డి గ్రాస్సే టైసన్’, వరల్డ్ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకనమిస్ట్ పాల్ మైకెల్ రోమర్తోనూ మోదీ భేటీ కానున్నారు. సుమారు 20మంది నోబెల్ గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగానికి చెందిన నిపుణులతో ప్రధాని మోదీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. దేశ రక్షణ రంగానికి సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తరచూ చికాకు పెడుతున్న పొరుగు దేశం చైనాపై కన్నేసేందుకు.. అమెరికా నుంచి 30సీ గార్డియన్ డ్రోన్ల కొనుగోలుపై చర్చించనున్నారు. ఇందుకోసం సుమారు 300 బిలియన్ డాలర్ల డీల్ జరగనున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రధాని మోదీ సైతం రక్షణ రంగానికి సంబంధించిన చర్చలపై ఆసక్తిగా ఉన్నట్లు భారత రక్షణ విభాగానికి చెందిన మాజీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా పర్యటనకు ముందు ప్రధాని నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ – రష్యా వార్ పై స్పందించిన ఆయన.. తాము తటస్థ వైఖరి ప్రదర్శిస్తున్నామనడంలో అర్థం లేదన్నారు. ఇరుదేశాల దేశాల సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ.. శాంతి వైపున భారత్ నిలిచిందన్నారు. పుతిన్, జెలెన్స్కీతో తాను పలుమార్లు మాట్లాడినట్లు ప్రధాని మోదీ గుర్తు చేశారు.