Baba Siddique| ప్రముఖ ముంబై రాజకీయ నాయకుడు బాబా సిద్దిఖ్ హత్య కేసులో పోలీసులు మూడో నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు పుణె నగరంలో దాగి ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు ఆదివారం సాయంత్రం అతడిని పట్టుకున్నారు.
పుణెలో పట్టుబడిని నిందితుడి పేరు ప్రవేణ్ లోంకార్ అని, ఇతడే షూటర్లకు ఎన్సీపీ నాయకుడు బాబా సిద్దిఖ్ హత్య కాంట్రాక్టు ఇచ్చాడని పోలీసులు తెలిపారు. ఇంతకుముందు ముంబై పోలీసులు శనివారం ముగ్గురు షూటర్లలో ఇద్దరు గుర్మైల్ సింగ్, ధర్మరాజ్ కష్యప్ లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ముంబైలోని ఎస్ప్లనేడ్ కోర్టు ఈ ఇద్దరు నిందితులను అక్టోబర్ 21 వరకు పోలీస్ కస్టడీకి పంపింది. హత్య సమయంలో ఉన్న మూడో షూటర్ శివకుమార్ గౌతమ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
ప్లాన్ ప్రకారం.. పట్టుబడిన ఇద్దరు గుర్మైల్ సింగ్, కష్యప్ ఇద్దరు బాబా సిద్దిఖ్ పై కాల్పలు జరపాలి. కానీ చివరి నిమిషంలో ఘటనా స్థలంలో ఎక్కువ జనం, పోలీస్ సెక్యూరిటీ ఉండేసరికి ప్లాన్ మారిపోయిందని విచారణలో తేలింది. అయితే పరారీలో ఉన్న మరో నిందితుడు శివకుమార్ గౌతమ్.. బాబా సిద్దిఖ్ పై తాను కాల్పులు చేస్తానని మిగతా ఇద్దరు గాల్లో కాల్పులు చేసి పారిపోవాలని సూచించాడని పోలీసులు తెలిపారు.
Also Read: ఒక బాయ్ ఫ్రెండ్, ఇద్దరు గర్లఫ్రెండ్స్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో చివరికి రక్తపాతమే
ఆ తరువాత శివకుమార్ బాబా సిద్దిఖ్ పై జనం అందరూ చూస్తుండగా.. ఆయనపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. అందులో రెండు రౌండ్ల బాబా సిద్దిఖ్ శరీరంలో దూసుకుపోయాయి. కాల్పుల జరిపిన వెంటనే శివకుమార్ సెక్యూరిటీ సిబ్బందిపై కారం పొడి చల్లి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే మిగతా ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల ప్రకారం.. ముగ్గురు షూటర్ల వద్ద కారం పొడి ఉన్నది. కాల్పులు జరిగిన తరువాత బాబా సిద్దిఖ్ ను వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆయన చికిత్స పొందుతూ మరణించారు.
హత్య కేసులో విచారణ ప్రారంభించిన పోలీసులు పట్టుబడిన ఇద్దరు నిందితులను ప్రశ్నించగా.. తమకు ఏమీ తెలియదని.. కేవలం శివకుమార్ కు మాత్రమే ఫోన్ ద్వారా ఆదేశాలు అందేవని చెప్పారు. ఘటనా స్థలంలో ఉన్న ముగ్గురు షూటర్లు కూడా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భైరాచ్ జిల్లాకు చెందినవారని తెలిసింది.ఈ ముగ్గురిలో గర్మైల్ సింగ్ గతంలో ఒక హత్య చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
అయితే విచారణలో ఇంకా షాకింగ్ విషయాలు తెలిశాయి. నిజానికి వినాయక చవితి సమయంలో హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. కానీ సందర్భం కలిసి రాలేదు. పోలీసులు ప్రముఖ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్నోయి గ్యాంగ్కు ఈ హత్యలో భాగముందని అనుమానాలు వ్యక్తం చేశారు. ముగ్గురు షూటర్లు కూడా ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఒక ఫ్లాట్ నెలకు రూ.14000 రెంటుకి తీసుకొని సెప్టెంబర్ నుంచి ఉన్నారు. హత్య చేసేందుకు గత మూడు నెలలుగా రెక్కీ కూడా చేశారని తెలిసింది. ఈ ముగ్గురు నిందితులు.. ఇంతకుముందు పంజాబ్ జైల్లో ఖైదీలుగా ఉన్న సమయంలో కలిశారు. హత్య చేసేందుకు ముగ్గురికీ తలా రూ.50000 అందిందని సమాచారం.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండడంతో బాబా సిద్దిఖ్ లాంటి ప్రముఖ రాజకీయ నాయకుడి హత్య ఘటన రాజకీయంగా మారింది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు అధికార కూటమి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నారు. పోలీసులు ఈ హత్య కేసులో బిజినెస్ శత్రుత్వం, కాంట్రాక్ట్ కిల్లింగ్, బాబా సిద్దిఖ్ చేపట్టిన ఒక స్లమ్ ప్రాజెక్ట్ కోణాలలో విచారణ జరుపుతున్నారు.