ఏటా కేంద్ర ఆర్థిక మంత్రి లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెడుతుంటారు. అయితే.. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు తలెత్తిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దేశ ప్రధాన మంత్రులే బడ్జెట్ను ప్రవేశ పెట్టా్ల్సి వచ్చింది. నాటి నుంచి అలా బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ప్రధానులు, అందుకు గల కారణాలేమిటో ఓసారి తెలుసుకుందాం.
ఆర్థిక మంత్రికి బదులుగా పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశ పెట్టినది.. మన తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. నాటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి రాజీనామా చేయడంతో 1958-59 బడ్జెట్ను నెహ్రూజీయే పార్లమెంటుకు సమర్పించారు.
1970లోనూ మరోసారి అలాగే జరిగింది. నాటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ తన పదవికి రాజీనామా చేయటంతో నాటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. దీంతో ఆమె బడ్జెట్ను సమర్పించిన తొలి మహిళగానూ రికార్డుకెక్కారు.
1987-88లో నాటి ఆర్థిక మంత్రి వీపీ సింగ్ రాజీనామా వల్ల ప్రధాని రాజీవ్ గాంధీ.. పార్లమెంట్కు బడ్జెట్ను సమర్పించారు. ఇలా.. నెహ్రూ కుటుంబానికి చెందిన మూడు తరాల ప్రతినిధులు.. ప్రధాని హోదాలోనే బడ్జెట్లు ప్రవేశపెట్టారు.
ఇక.. ఎక్కువసార్లు బడ్జెట్లను సమర్పించిన ఆర్థిక మంత్రుల్లో మొరార్జీ దేశాయ్ ప్రధమ స్థానంలో ఉన్నారు. ఆయన ఏకంగా 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత స్థానాల్లో పి.చిదంబరం(9 బడ్జెట్లు), ప్రణబ్ ముఖర్జీ(8), యశ్వంత్ సిన్హా(8), మన్మోహన్ సింగ్(6) నిలిచారు.
అయితే.. బడ్జెట్ సందర్భంగా సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రుల్లో నిర్మలా సీతారామన్ ముందున్నారు. 1 ఫిబ్రవరి 2020న ఆమె బడ్జెట్ను(2020-21) సమర్పించి.. 2 గంటల 42 నిమిషాలు మాట్లాడారు. అదే ఇప్పటివరకు రికార్డు. ఆ తర్వాత స్థానంలో ఉన్న జస్వంత్ సింగ్ 2003 బడ్జెట్ సమర్పణ సమయంలో 2 గంటల 13 నిమిషాలు ప్రసంగించారు.
అయితే.. బడ్జెట్ ప్రసంగానికి అతి తక్కువ సమయం తీసుకున్న ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ. 1982లో ఆయన 1 గంట 35 నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించారు. షార్టెస్ట్ ఆర్థిక మంత్రి.. లాంగెస్ట్(సుదీర్ఘ) బడ్జెట్ను సమర్పించారంటూ నాటి ప్రధాని ఇందిరాగాంధీ చమత్కరించారు. పొట్టిగా ఉండే ప్రణబ్ ముఖర్జీ పెద్ద బడ్జెట్టే పెట్టారని దాని అర్థం.
ఇక.. బడ్జెట్ ప్రసంగంలోని పదాలను లెక్కవేస్తే.. పీవీ హయాంలో 1991లో మన్మోహన్సింగ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి. ఈ విషయంలో అరుణ్ జైట్లీకి రెండో స్థానం దక్కుతుంది. 2018లో 18,604 పదాలతో ఆయన బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. మొత్తం 1 గంట 49 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు.
ఇక అందరి వరకు అత్యంత క్లుప్తంగా, తక్కువ పదాలతో బడ్జెట్ ప్రసంగం చేసిన ఘనత హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్కు దక్కుతుంది. 1977లో ఆయన 800 పదాలతో తన ప్రసంగాన్ని ముగించడం విశేషం.