Punjab CM Bhagwant Mann on Kangana issue: ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన బాలీవుడ్ సీనియర్ నటి కంగనా రనౌత్ను సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టిన ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. పంజాబ్ రైతుల పోరాటంపై కంగనా చేసిన వ్యాఖ్యల కారణంగానే ఆమెను కానిస్టేబుల్ కొట్టిందంటూ ఆయన పేర్కొన్నారు.
అది కోపమే.. కానీ, గతంలో కంగనా మాట్లాడిన మాటలే ఆ కానిస్టేబుల్ను ఆగ్రహానికి గురి చేశాయి. అయితే, ఇది జరగకుండా ఉండాల్సింది. ఆమె అలా మాట్లాడడం తప్పు అంటూ భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయితే.. ఈ ఘటన జరిగిన తర్వాత నటి కంగనా చేసిన వ్యాఖ్యల పట్ల పంజాబ్ సీఎం అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్ రాష్ట్రంలో తీవ్రవాదమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో పంజాబ్ ప్రజలు చేసిన పోరాటాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే నేడు పంజాబ్.. దేశానికి ఆహారాన్ని అందజేస్తుందని తెలిపారు. రాష్ట్రంపై ప్రతీ విషయంలో తీవ్రవాదులు, వేర్పాటు వాదులంటూ విమర్శించడం సరికాదన్నారు. పంజాబ్ రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేసిన సమయంలో తీవ్రవాదులంటూ ఆరోపించారని వాపోయారు.
Also Read: మణిపూర్ హింసపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
కాగా, జూన్ 6న కంగనా రనౌత్ చండీగఢ్ ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ చెక్కు వెళ్లిన క్రమంలో అక్కడున్న కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను చెంప దెబ్బ కొట్టింది. రైతుల పోరాటంలో తన తల్లి పాల్గొన్నదని, ఆ పోరాటాన్ని కంగనా రనౌత్ కించపరిచినందుకే తాను కొట్టినట్లు ఆమె పేర్కొన్న విషయం తెలిసిందే.