Karnataka CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న మైసూరు నగరాభివృద్ధి సంస్థ(ముడా) కుంభకోణంపై హైకోర్టులో విచారణ కొనసాగుతున్న వేళ సీఎం పదవి నుంచి సిద్ధరామయ్య వైదొలిగితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై స్థానికంగా తీవ్ర నడుస్తున్నది. ఈ క్రమంలో సిద్ధరామయ్య స్పందించారు. సీఎం పీఠం ఏమీ ఖాళీగా లేదంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీటు ఎవరూ ఆక్రమించుకునేందుకు అదేమీ ఖాళీగా లేదు. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి ప్రకటనే వెలువడలేదు. అసలు దీనిపై చర్చ అనవసరం. ఇంతకు సీఎం కుర్చీ ఖాళీగా లేనప్పుడు ఇంకెవరు కొత్తగా ముఖ్యమంత్రి అవుతారు..? ఆ పదవిలో నేనే కొనసాగుతాను. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు’ అంటూ ఆయన పేర్కొన్నారు.
Also Read: మేము ఉన్నంత వరకూ.. దానిని టచ్ కూడా చేయలేరు : రాహుల్ వ్యాఖ్యలపై అమిత్ షా స్పందన
ఇదిలా ఉంటే.. ఒకవేళ కర్ణాటక రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగాల్సి వస్తే ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడుతున్న మంత్రులు, సీనియర్లను హెచ్చరించాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం లేఖ రాసింది.
మరోవైపు.. ముఖ్యమంత్రి పదవిపై వస్తున్న ఊహాగానాలకు అడ్డుకట్ట వేయాలంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంజునాథ్ భండారి, ఎమ్మెల్సీ దినేశ్ గూలిగౌడలు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రిక్వెస్ట్ చేశారు.
అయితే, మైసూరు నగరాభివృద్ధి సంస్థ(ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతమ్మకు వారసత్వంగా వచ్చినటువంటి భూములను ‘ముడా’ స్వాధీనం చేసుకుని మరోచోట స్థలాలు ఇచ్చింది. అయితే, స్వాధీనం చేసుకున్న ఆ భూముల కంటే ముడా మరో చోట ఇచ్చిన భూముల విలువ ఎక్కువగా ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం విధితమే.
Also Read: 70 ఏళ్లు పైబడినవారికి గొప్ప శుభవార్త.. ఉచితంగా రూ. 5 లక్షలు..
ఈ ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ తాఖీదులను జారీ చేశారు. ఇందుకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై విచారణకు సిద్ధరామయ్య హాజరు కావాలంటూ ఆ తాఖీదుల్లో పేర్కొన్నారు. వీటిని సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సీఎం మారొచ్చంటూ స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య స్పందించి పై విధంగా పేర్కొన్నారు.