Ganga River : గంగానదీ పుష్కరాల సందడి మొదలు కాబోతోంది. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ సంబరాలకు భక్తులు భారీగా పోటెత్తే అవకాశం ఉంది. 12 రోజులపాటు గంగా తీరం జనసంద్రంగా మారనుంది. లక్షల మంది భక్తులు గంగానదిలో స్నానమాచరించేదుకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 22న గంగానదీ పుష్కరాలు ప్రారంభమవుతాయి. మే 3 తేది వరకు పుష్కరాల వేడుకలు కొనసాగుతాయి.
రైళ్లు ఫుల్..
దేశం నలుమూలల నుంచి భక్తులు పుష్కరాల వేడుకలలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాశీ , ప్రయోగ, హరిద్వార్, గంగోత్రి, బద్రీనాథ్ కు యాత్రికులు ఎక్కువగా వెళుతుంటారు. ఇప్పటికే రైళ్లలో టిక్కెట్లు నిండిపోయాయి. వెయిటింగ్ లిస్ట్ చాంతాండ పెరిగిపోయింది. సికింద్రాబాద్ నుంచి వారణాసి మీదుగా వెళ్లే దానాపూర్ ఎక్స్ప్రెస్లో వెయిటింగ్ లిస్టు 400ను దాటింది. మే 3 వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పరిస్థితి ఇలా ఉన్నా ఈ మార్గంలో మరో అదనపు రైలును అధికారులు నడపటం లేదు.
వారణాసి పుణ్యక్షేత్రానికి నిత్యం తెలంగాణ నుంచి దాదాపు రెండు వేలమంది భక్తులు వెళ్తుంటారు. పుష్కరాలు జరిగే సమయంలో ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. ఆ 12 రోజుల్లో తెలంగాణ నుంచి 2 లక్షల మందికిపైగా భక్తులు కాశీ యాత్ర చేపడతారని అంచనా . సాధారణ రోజుల్లోనే ఉన్న ఒక్క సర్వీసు సరిపోవటం లేదు. మరి పుష్కరాల వేళ రద్దీకి తగ్గట్టుగా సర్వీసులు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాశీ విశ్వనాథుడిని దర్శించుకునేందుకు వెళ్లే దక్షిణ భారత యాత్రికుల్లో తెలుగువారే ఎక్కువ. రైల్లో కాశీకి వెళ్లేవారికి దానాపూర్ ఎక్స్ప్రెస్ ఒక్కటే దిక్కు. హైదరాబాద్ లో పనిచేస్తున్న బీహార్ వలస కూలీలు కూడా ఈ రైలు మీదే ఆధారపడుతుంటారు. దీంతో గతంలో ఈ రైలుకు అనుబంధంగా ఓ క్లోన్ రైలు నడిపేవారు. అదే మార్గంలో అరగంట తేడాతో మరో రైలు అందుబాటులో ఉండేది. ముందు రైలుకు ఉన్న ఫ్రీ సిగ్నల్ క్లియ రెన్స్ సమయంలోనే ఈ క్లోన్ రైలు నడిచేది. కోవిడ్ ఆంక్షల సమయంలో ఈ సర్వీసును రద్దు చేశారు. కానీ ఈ సర్వీసును పునరుద్ధరించలేదు.
విమాన ప్రయాణం.. చార్జీల మోత..
సాధారణ రోజుల్లో కాశీకి విమాన టికెట్ ధర రూ.5 వేల నుంచి రూ.8 వేలుగా ఉండేది. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు టికెట్ ధర పెంచుకునే డైనమిక్ ఫేర్ విధానాన్ని ఇప్పుడు విమానయాన సంస్థలు బాగా వినియోగించుకుంటున్నాయి. గంగానదీ పుష్కరాలకు భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుండటంతో ఒక్కో టికెట్ ధరను రెట్టింపు చేసి విక్రయిస్తున్నాయి. మరి సామాన్య భక్తులు కాశీకి వెళ్లే దారేది..?