కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ ఈ కీలక బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే.. లోక్సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్ డిమాండ్ను మోదీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ డిమాండ్ను నెరవేర్చే ధైర్యం మోదీ సర్కారుకే ఉందన్నారు. మంత్రివర్గ ఆమోదంతో ఇది రుజువైందని తెలిపారు.
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు బిల్లు ఇప్పటిది కాదు. 1996లో హెచ్డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలుత లోక్సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్పేయి, మన్మోహన్ సింగ్ హయాంలోనూ బిల్లును ప్రవేశ పెట్టినప్పటినా.. ఆమోదానికి నోచుకోలేదు. చివరగా ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్సభలో మాత్రం పెండింగులో ఉండిపోయింది. 2014లో లోక్సభ రద్దకావడంతో అక్కడ బిల్లు మురిగిపోయింది.
ఈ నేపథ్యంలో మోదీ సారథ్యంలో కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లుకు లోక్సభ గ్రీన్సిగ్నల్ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే రాజ్యసభను శాశ్వత సభగా పిలుస్తారు. అక్కడ ఆమోదం పొందిన ఏ బిల్లు కూడా మురిగిపోదు. లోక్సభ ఆమోదించి, పెద్దలసభ ఓకే చేయకపోతే మాత్రం.. లోక్సభ పదవీకాలం పూర్తైతే ఆ బిల్లు మురిగిపోయినట్టే. కానీ మహిళా బిల్లు విషయంలో మాత్రం రాజ్యసభ 2010లోనే ఆమోదించింది కాబట్టి.. ఇప్పుడు లోక్సభ మూడింట రెండొంతుల మెజార్టీతో గ్రీన్ సిగ్నల్ ఇస్తే సరిపోతుంది. రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాలుస్తుంది.
ప్రతి ఒక్క పార్టీ మహిళ బిల్లుకు మద్దతిస్తుంది. కానీ పార్లమెంట్లో మాత్రం ఎందుకు ఆమోదం పొందదు? ఇప్పటికి 27 ఏళ్లు గడిచిపోయాయి. దాదాపు మూడు దశాబ్దాలు. చివరగా 2008లో సమాజ్వాదీ పార్టీ, RJD, JDU సభలో వ్యతిరేకించాయి. పబ్లిక్లో మాత్రం ఈ మూడు పార్టీలు అనుకూలమనే చెప్తాయి. బిల్లులోని కొన్ని టర్మ్స్పై అభ్యంతరమని చెప్తూ వస్తున్నాయి. ప్రస్తుత లోక్సభలో బీజేపీకి 303 మంది ఎంపీల బలం ఉంది. మిత్రపక్షాలకు తోడు కొన్ని తటస్థ పార్టీలు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉన్న నేపథ్యంలో మూడింట రెండొంతుల మెజార్టీతో మహిళా బిల్లుకు మోక్షం కలిగిస్తుందా?