Election Commission : ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలకతీర్పు ఇచ్చింది. భారత ఎన్నికల సంఘం సభ్యుల నియామక ప్రక్రియలో సంస్కరణలు కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ కె.ఎం. జోసఫ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వ్యవస్థను రద్దు చేసింది. ఎన్నికల సంఘంలో నియామకాలను.. ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే చేపట్టాలని ఆదేశించింది. ఒకవేళ ప్రతిపక్ష నేత లేకపోతే విపక్షంలో మెజార్టీ పార్టీ సభ్యుడు కమిటీలో ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది.
త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సులతో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ , ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి మాత్రమే నియమించాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 5-0 మెజార్టీతో ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ , ఎన్నికల కమిషనర్ల నియామకాల కోసం పార్లమెంట్ కొత్త చట్టం తీసుకొచ్చేంత వరకు ఈ త్రిసభ్య కమిటీ అమల్లో ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ చీఫ్ ఎంపిక తరహాలోనే సీఈసీ నియామకం జరగాలని సూచించింది.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. పారదర్శకత లేకపోతే వినాశకర పరిణామాలకు దారితీస్తుందని అభిప్రాయ వ్యక్తంచేసింది. రాజ్యాంగ పరిధిలోనే ఈసీ పనిచేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ న్యాయబద్ధంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.