All Party Meeting : వచ్చే ఏడాది సెప్టెంబర్ లో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న జీ-20 సదస్సుకు వ్యూహాలను ఖరారు చేసేందుకు కేంద్రం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి రావాలని 40 రాజకీయ పార్టీల అధ్యక్షులను ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్లో ఈ సమావేశం జరగనుంది.
భారత్ డిసెంబర్ 1న జి-20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. జీ -20 సదస్సు నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ నుంచి హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 200 సమావేశాలను నిర్వహించనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ-20 సదస్సు జరగనుంది. దీనికి సభ్యదేశాల అధినేతలు , ప్రతినిధులు హాజరవుతారు. ఈ నేపథ్యంలో సదస్సు నిర్వహణపై దేశంలో అనేక ప్రాంతాల్లో కేంద్రం సమావేశాలు ఏర్పాటు చేయనుంది.
ఇండోనేషియాలోని బాలిలో జరిగిన సదస్సులో జి-20 అధ్యక్ష బాధ్యతలను భారత్కు అప్పగించారు. జీ-20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల ఉమ్మడి వేదిక. ఇందులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యూఎస్, యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలుగా ఉన్నాయి.
ఢిల్లీలో జరిగే అఖిలపక్ష భేటీలో అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలను, సూచనలను, సలహాలను కేంద్ర ప్రభుత్వం స్వీకరిస్తుంది. వాటి ఆధారంగా జీ -20 సదస్సును ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది.