Gujarat : రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో కునుకు తీసిన ఓ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన గుజరాత్లో జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ భుజ్ లో పర్యటించారు. 2001లో సంభవించిన పెను భూకంప బాధితుల పునరావాసం కోసం ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
ఆ తర్వాత సీఎం భూపేంద్ర పటేల్ ప్రసంగించారు. ఆ సమయంలో సభలో కూర్చున్న ఓ అధికారి నిద్రపోయారు. ఆ ఆఫీసర్ కునుకు తీసిన వీడియో వైరల్ గా మారింది. దీంతో ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఆ అధికారిని భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్ గా గుర్తించింది.
సీఎం సభలో నిద్రపోయిన అధికారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. గంటల వ్యవధిలోనే రాష్ట్ర పట్టణాభివృద్ధి విభాగం ఆ అధికారిని విధుల నుంచి సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరించారని పేర్కొంది. నిబంధనల ప్రకార జిగర్ పటేల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని ఉత్తర్వులు ఇచ్చింది. ఇలా ముఖ్యమంత్రి కార్యక్రమంలో నిద్రపోయి ఆ అధికారి సస్పెన్షన్ కు గురయ్యారు.