Tigers : దేశంలో ఏటా పులుల సంఖ్య పెరుగుతోంది. 2022 నాటికి పులుల సంఖ్య 3,167కు చేరింది. కర్ణాటక మైసూరులో ప్రాజెక్ట్ టైగర్ స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ పులుల తాజాగా లెక్కలు వెల్లడించారు. అఖిల భారత పులుల అంచనా నివేదికను విడుదల చేశారు.
ప్రధాని చెప్పిన వివరాలు ప్రకారం..దేశంలో పులుల సంఖ్య 2006లో 1,411, 2010లో 1,706, 2014లో 2,226, 2018లో 2,967, 2022లో 3,167గా ఉంది. భారత్ కేవలం పులులను సంరక్షించడమే కాకుండా.. వాటి సంఖ్య పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రాజెక్ట్ టైగర్ విజయవంతం కావడం కేవలం యావత్ ప్రపంచానికి గర్వకారణమని అన్నారు.
అంతర్జాతీయ పులల కూటమిని మోదీ ప్రారంభించారు. ఈ కూటమి ప్రపంచవ్యాప్తంగా ఏడు రకాల పులుల సంరక్షణకు కృషి చేస్తుందని తెలిపారు. పులుల సంరక్షణ కార్యక్రమం విజయానికి చిహ్నంగా రూ.50 స్మారక నాణేన్ని ఆవిష్కరించారు. అమృత్ కాల్లో పులుల సంరక్షణకు సంబంధించిన ప్రణాళికను మోదీ విడుదల చేశారు. ప్రకృతిని రక్షించడం భారత సంస్కృతిగా పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం పులలలో 75 శాతం భారత్లోనే ఉన్నాయని వివరించారు.
ప్రపంచ భూభాగంలో భారత్ వాటా 2.4 శాతంగా ఉన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ప్రపంచ జీవవైవిధ్యంలో 8 శాతం వాటా భారతదేశానిదని తెలిపారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల చీతాలను భారత్కు తీసుకొచ్చిన విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు. దాదాపు 30 వేల ఏనుగులతో ప్రపంచంలోనే అత్యధిక ఆసియా ఏనుగులు ఉన్న దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు.