Karnataka : సాధారణంగా అధికార పార్టీ నాయకులు ఎలాంటి స్కాములు చేసినా, లంచాలు తీసుకున్నా పట్టుబడటం చాలా అరుదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచే ఒత్తిడితో అధికారులు వెనక్కుతగ్గుతారు. కానీ ఆ రాష్ట్రంలో మాత్రం అలా జరగలేదు. ముడి వస్తువుల కొనగోలు టెండర్ ఇప్పిస్తానంటూ ఓ గుత్తేదారు నుంచి రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు అడ్డంగా దొరికిపోయాడు.
కర్ణాటకలోని దావణగెరె జిల్లా చెన్నగిరి ఎమ్మెల్యే మాడాళు విరూపాక్షప్ప. ఆయన కొడుకు ప్రశాంత్ తాజాగా లోకాయుక్త అధికారులకు చిక్కాడు. బెంగళూరు జలమండలిలో చీఫ్ అకౌంటెంట్గా పని చేస్తున్న ప్రశాంత్ ముడి వస్తువుల కొనుగోలు టెండరు విషయంలో రూ. 80 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారనేది ఆరోపణ. దీంతో బాధితుడు లోకాయుక్తను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన లోకాయుక్త అధికారులు ప్రశాంత్ కార్యాలయంపై దాడి చేసి లంచం కింద తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నివాసంపైనా దాడి జరిపారు. రూ. 6 కోట్ల నగదును గుర్తించారు. అందులో రూ.1.7 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంత్ను లోకాయుక్త అధికారులు అరెస్టు చేశారు.
మైసూర్ శాండల్ సబ్బును తయారు చేసే ప్రభుత్వ ఆధీనంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ కు ఎమ్మెల్యే విరూపాక్షప్ప ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కుమారుడి అరెస్టుతో కేఎస్డీఎల్ పదవికి విరుపాక్షప్ప రాజీనామా చేశారు. కర్ణాటకలో ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే సీఎం బసవరాజ్ బొమ్మై సహా చాలామంది బీజేపీ నేతలపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే కొడుకే లంచం కేసులో పట్టుబడటం సంచలనం రేపుతోంది. ప్రతిపక్ష పార్టీలకు ఈ అంశం ఆయుధంగా మారింది.