cancer : ఇండియాలో క్యాన్సర్ మరణాలు ప్రతిఏటా పెరుగుతున్నట్లు లాన్సెట్ పత్రిక పేర్కొంది. ఇండియాలో 2019 గణాంకాలను పరిశీలిస్తే 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు బయటపడ్డాయి. అందులో 9.3లక్షల మంది క్యాన్సర్ వ్యాధితో మరణించినట్లు వెల్లడించింది. ఆసియా ఖండంలో చైనా, జపాన్, భారత్లో అత్యధిక కేసులు, మరణాలు నమోదు అవుతున్నట్లు ప్రకటించింది.
2019లో ఆసియాలో మొత్తం 94 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అయినట్టు తెలిపింది. మొత్తం 56 లక్షల మంది ప్రాణాలు కోల్పొయారని పేర్కొంది. చైనాలో 48 లక్షల కేసులు నమోదవ్వగా.. 27లక్షల మంది ప్రాణాలు విడిచినట్లు తెలిపింది. ఇక జపాన్లో 9 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అవ్వగా.. 4.4 లక్షల మంది వ్యాధితో ప్రాణాలు విడిచినట్లు ప్రకటించింది. లాన్సెట్ పత్రిక చేసిన ఈ పరిశోధనలో ఇండియా నుండి కురుక్షేత్ర నిట్, జోధ్పుర్, బటిండా పరిశోధన బృందాలు పాల్గొన్నాయి.
ఆసియా దేశాల్లో ముఖ్యంగా గొంతు, ఊపరితిత్తుల క్యాన్సర్లు సోకుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు. మహిళల కంటే పురుషులకు అత్యధికంగా క్యాన్సర్ సోకుతున్నట్లు పరిశోధనలో పేర్కొంది. వక్షోజాలు, పెద్దపేగు, రెక్టమ్, ఉదర, నాన్-మెలనోమా స్కిన్ క్యాన్సర్లు కూడా అధికంగానే నమోదు అవుతున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా పొగ త్రాగడం , మద్యం సేవించడం, పెరుగుతున్న కాలుష్యం వంటివి క్యాన్సర్ సోకడానికి ప్రధాన కారణాలుగా పరిశోధనలో గుర్తించారు. ప్రజలకు కాన్సర్ పట్ల ప్రభుత్వాలు మరింత అవగాహన పెంపొందిచాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. ఆసియాలో మొత్తం 49 దేశాల్లో 29 రకాల క్యాన్సర్లపై పరిశోధన జరిగింది. ప్రతి ఏటా 13 లక్షల కొత్త కేసులు బయటపడుతున్నట్టు ప్రకటించింది.