Ayodhya Temple : అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన క్రతువులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతిష్ఠాపనకు మూడు విగ్రహాలను సిద్ధం చేయించినట్లు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సోమవారం వెల్లడించారు. అందులో మైసూరు శిల్పి మలిచిన దాన్ని ఖరారు చేశారు.
Ayodhya Temple : అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన క్రతువులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతిష్ఠాపనకు మూడు విగ్రహాలను సిద్ధం చేయించినట్లు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సోమవారం వెల్లడించారు.
ఈ నెల 22న ప్రతిష్ఠించనున్న రామ్లల్లా విగ్రహం ఖరారైనట్లు చంపత్ రాయ్ తెలిపారు. అయోధ్యలో ప్రతిష్ఠకు కర్ణాటకకు చెందిన మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన ప్రతిమను ఎంపిక చేసినట్లు తెలిపారు. దీన్ని రాయితో మలిచారన్నారు.
ఈ విగ్రహం 150-200 కిలోల బరువు ఉంటుందని చెప్పారు. ముందుగా ముగ్గురు వేర్వేరు శిల్పులు మలిచిన మూడు విగ్రహాలను సిద్ధం చేయించామన్నారు. యోగిరాజ్ చెక్కిన ప్రతిమను ఖరారు చేసినట్లు చంపత్ రాయ్ వెల్లడించారు. ఐదేళ్ల వయసున్న బాలరాముడు నిలబడి ఉన్న రూపంలో విగ్రహం ఉంటుందని ఆయన వెల్లడించారు.
బాలరాముడి విగ్రహ రూపురేఖల్ని గతంలో చంపత్ రాయ్ ఓ ఇంటర్వ్యూలో వర్ణిస్తూ.. ‘రాముడి కళ్లు తామర రేకుల మాదిరిగా ఉంటాయన్నారు. ఆయన ముఖం చంద్రుడిలా ప్రకాశిస్తుందని తెలిపారు. పెదవులపై నిర్మలమైన చిరునవ్వు ఉంటుందన్నారు. పొడవాటి చేతులతో విగ్రహం తయారైందన్నారు. దైవత్వం ఉట్టిపడుతున్న ఈ విగ్రహం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసే విధంగా ఉంటుందని తెలిపారు.
ఈ విగ్రహంలో దశరథ కుమారుడు, విష్ణుమూర్తి అవతారమైన రాముడిని చక్కగా చూడవచ్చు అని చంపత్ రాయ్ తెలిపారు. జనవరి 21, 22 తేదీల్లో అయోధ్య ఆలయంలో సామాన్య భక్తులకు అనుమతి లేదని రాయ్ తెలిపారు. జనవరి 23 నుంచి భక్తులకు రామ్లల్లా దర్శన భాగ్యం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.
గత 70 ఏళ్లుగా ఈ ప్రదేశంలో పూజలందుకుంటున్న రామ్లల్లా విగ్రహాన్ని సైతం గర్భగుడిలో ఉంచుతామని చంపత్ రాయ్ వెల్లడించారు. యోగిరాజ్ మలిచిన బాలరాముడి విగ్రహాన్నే ప్రతిష్ఠించనున్నట్లు కొన్ని రోజుల క్రితం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్( ఎక్స్) ద్వారా వెల్లడించారు. కానీ, అప్పటికి ఇంకా విగ్రహాన్ని ఖరారు చేయలేదని తీర్థక్షేత్ర ట్రస్టు వెల్లడించింది.