Historical Forts In India : నాటి రాజులు తమ రక్షణ కోసం నిర్మించిన కొన్ని కోటలు నేటికీ సమున్నతంగా నిలిచి ఆనాటి చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిపోయాయి. ఆనాటి చరిత్రకు సాక్షులుగా తమను చూసేందుకు వచ్చిన పర్యాటకులకు అప్పటి పాలకుల వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతూనే ఉన్నాయి. మనదేశంలో నేటికీ నిలిచిఉన్న అలాంటి కొన్ని గొప్ప కోటల వివరాలు..
ఎర్రకోట
రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చాలని నాటి మొఘల్ చక్రవర్తి షాజహాన్ భావించాడు. వెంటనే తాజ్మహల్ను డిజైన్ చేసిన అహ్మద్ లాహోరి చేత ఎర్రకోట డిజైన్ చేయించారు. షాజహాన్ నేతృత్వంలో నిర్మితమైన ఈ 17వ శతాబ్దపు నిర్మాణం ఇస్లామిక్, మొఘల్, పార్సీ సంస్కృతుల మేళవింపుగా ఉంటుంది. కోటలోని దివాన్-ఇ-ఆమ్ దర్బారు, మోతీ మసీదు, పాలరాతి దివాన్-ఇ- ఖాస్ మండపం చూడదగినవి.
మెహరన్గఢ్ కోట
ఇది దేశంలోనే అత్యంత విశాలమైన కోట. రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉంది. దీని విస్తీర్ణం 1,200 ఎకరాలు, ఎత్తు 122 మీటర్లు. రాథోడ్ వంశీకుడు రావ్ జోధా దీనిని నిర్మించారు. కోటలోని చాముండి ఆలయం, రావ్ జోధా డెసర్ట్ రాక్ పార్క్, మొఘల్ పాలకుల కుడ్యచిత్రాలు, ఆయుధాలు చూడదగినవి. ఇక్కడ బాలీవుడ్, హాలీవుడ్ సినిమా షూటింగులూ జరుగుతాయి.
గ్వాలియర్ కోట
10వ శతాబ్దం నాటి ఈ కోట దేశంలోని అత్యంత పురాతన కోటల్లో ఒకటి. దీన్ని ఎప్పుడు, ఎవరు నిర్మించారన్న దానిపై స్పష్టత లేదు. కానీ.. తోమర్, మొఘల్, బ్రిటిష్, మరాఠా, సింధియా పాలకులు సుమారు 1000 ఏళ్లపాటు ఈ కోట నుంచే పాలన చేశారు. బ్రిటిషర్లు దీనిని జైలుగానూ వాడారు. 15 మీటర్ల కోట ప్రహరీ, కోటలోని ఆలయాలు, రాజ ప్రాసాదాలు, మండపాలు చూసితీరాల్సిందే.
ఆగ్రా కోట
తాజ్మహల్కి 2.5 కి.మీ దూరంలో, వాయువ్య దిశగా చౌహాన్ పాలకులచే నిర్మితమైన ఇటుక కోట ఇది. దీని ప్రాముఖ్యతను గుర్తించిన అక్బర్, దెబ్బతిన్న కోట బయటి భాగాన్ని ఇసుకరాతితో పునర్నిర్మాణం చేశారు. 1573లో నిర్మాణం పూర్తయిన ఈ కోటలో అక్బర్, జహాంగీర్, షాజహాను, ఔరంగజేబు ఇలా 4 తరాల వారసులు జీవించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితా(1983)లో చేరిన తొలి భారతీయ కట్టడం ఇదే.
కాంగ్రా
హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలకు 20 కి.మీ దూరాన గల కొండప్రాంతమైన కాంగ్డాలో ఈ కోట ఉంది. దీనిని రాజ్పుత్ర వంశీయులు దీనిని నిర్మించారు. అయితే, 1615లో అక్బర్ చక్రవర్తి ఈ కోటను జయించేందుకు విఫలయత్నం చేసినా ఫలించలేదు. బ్రిటిషర్లు తర్వాతి కాలంలో దీనిలో పాగా వేశారు. 1905 నాటి భూకంపంలో ఇది పాక్షికంగా ధ్వంసమైనా.. నేటికీ నాటి ఠీవిని నిలుపుకుంటోంది.
గోల్కొండ
కుతుబ్ షాహీ పాలకుల చేత నిర్మించబడిన ఈ కోట.. 120 మీటర్ల ఎత్తైన నల్లరాతి గుట్టపై ఉంది. బురుజులతో కలిసి 5 కి.మీ విస్తీర్ణంలో ఉండే ఈ కోటలోని రాణీమహల్, రామదాసు బందిఖానా, అమ్మవారి దేవాలయం వంటివి ఉన్నాయి. కోట ప్రవేశమార్గంలో చప్పట్లు కొడితే.. కొండపైన కిలోమీటరు మేర స్పష్టంగా వినిపించటం ఈ కోట ప్రత్యేకత.