Gyanvapi Case : వారణాసిలో జ్ఞానవాపి మందిరం పై వివాదం సరిగ్గా 31 ఏళ్ల క్రితం మొదలైంది. జ్ఞానవాపిపై ఎంతో మంది హిందువులు ఆందోళనలు, నిరసనలు, న్యాయ పోరాటాలు చేశారు.
1991 అక్టోబరు 15న జ్ఞానవాపి ప్రాంతంలో పూజలు చేసేందుకు అనుమతి కోరుతూ వారణాసి సివిల్ కోర్టులో స్థానిక పూజారులు పిటిషన్ దాఖలు చేశారు. 16వ శతాబ్దంలో ఔరంగజేబు ఆదేశాల మేరకు ఆలయాన్ని కూల్చి.. మసీదును నిర్మించారని పిటిషనర్లు ఆరోపించారు. అక్కడ భారత పురావస్తు శాఖ (ASI) సర్వే చేయాలని కోరారు.
అయితే.. 1997 జూన్లో కోర్టు దీనిపై విచారణ చేపట్టి, ఈ కేసు 1991.. ప్రార్థనా స్థలాల చట్టానికి వ్యతిరేకంగా ఉందని పేర్కొంటూ జులై 17న ఆ పిటిషన్ను కొట్టివేసింది.
కానీ.. దీనిపై హిందు, ముస్లిం వర్గాలు రివిజన్ పిటిషన్లు దాఖలు చేశాయి. దీంతో 1998, సెప్టెంబరు 28న జిల్లా జడ్డి.. దీనిపై వారి అభ్యంతరాలను పరిశీలించేందుకు అంగీకరించారు.
అయితే.. కోర్టు పున:పరిశీలన నిర్ణయం.. ప్రార్థనా స్థలాల చట్టానికి వ్యతిరేకమంటూ అంజుమన్ ఇంతెజామియా మసీద్ ( ఈ సంస్థ జ్ఞానవాపితో సహా వారణాసిలోని మరో 21 మసీదుల వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది) అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మందిరాన్ని కూల్చి మసీదు కట్టలేదని, అది వక్ఫ్ భూమిలో ఉందనీ, కనుక సిటీ కోర్టు ఈ కేసును విచారించటం కుదరదని ఆ సంస్థ వాదించింది. దీంతో.. 1998 అక్టోబరులో ఈ వ్యవహారం అంతా హైకోర్టు పరిధిలోకి వచ్చింది.
ఇలా గత 22 ఏళ్లుగా ఈ కేసు సాగుతూనే వచ్చింది. ఇంతలో..
2019 నవంబరులో భారత సుప్రీంకోర్టు అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులకే దక్కుతుందని తీర్పు వచ్చింది. 1991 ప్రార్థనా స్థలాల చట్టానికి కేవలం అయోధ్య ఒక్కటే మినహాయింపు అని నాటి తీర్పులో కోర్టు స్పష్టంగా చెప్పింది.
అటు.. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా మధుర, కాశీ తమ ఎజెండాలో లేవని ప్రకటించటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కానీ.. అయోధ్యపై సుప్రీంకోర్టు అంతిమ తీర్పు వచ్చిన సరిగ్గా నెలరోజులకు.. డిసెంబరులో వారణాసి సివిల్ కోర్టులో విజయ్ శంకర్ రస్తోగీ అనే లాయరు ఒక కొత్త పిటిషన్ వేశాడు. కాశీ విశ్వనాధుడి ప్రతినిధిగా తాను ఈ పిటిషన్ దాఖలు చేశాననీ, ఆ స్వామి వాదననే తాను వినిపిస్తున్నాని, అయోధ్యలో మాదిరిగా ఇక్కడా పురావస్తుశాఖ సర్వే చేయాలని కోరారు.
సరిగ్గా 2 నెలలకు, 2020 ఫిబ్రవరిలో 1991లో ఈ కేసును దాఖలు చేసిన వారంతా తిరిగి వారణాసి సివిల్ కోర్టుకు వచ్చి, 1998 అక్టోబరు నుంచి నిలిపివేసిన తమ కేసును తిరిగి విచారించాలని కోరారు. ‘కోర్టు ఇచ్చిన ఏ స్టే ఆర్డరైనా 6 నెలలకు పున: పరిశీలనకు అర్హమైనదే’ అన్న 2018 నాటి సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా తమ కోరిక సమంజసమైనదేనని వారు ప్రస్తావించారు.
దీనిని అంజుమన్ ఇంతెజామియా సంస్థ వ్యతిరేకించగా, స్టే ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు.. దాని తీర్పును 2020 మార్చి 14కి వాయిదా వేసింది.
అయితే.. ఎవరూ ఊహించని రీతిలో .. అసలు 1991 ప్రార్థనా స్థలాల చట్టమే అన్యాయమంటూ 2021 మార్చిలో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ చట్టం హిందూ,జైన, బౌద్ధ ఆలయాలను నేలమట్టం చేసిన ముస్లిం దురాక్రమణ దారుల దుర్మార్గాలను సమర్థిస్తోందనీ, దాని రద్దు చేయాల్సిందేనని, తద్వారా ఆయా మతాల వారు కోల్పోయిన మందిరాలను తిరిగి వారికి హక్కు కల్పించాల్సిందేనంటూ బీజేపీ నేత, పేరున్న లాయర్ అశ్వినీ ఉపాధ్యా్య వాదన లేవనెత్తారు.
దీనికి కొనసాగింపుగా.. 1991 ప్రార్థనా స్థలాల చట్టం రాజ్యాంగ విరుద్ధమైనదంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఒక ప్రత్యేక పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఆర్టికల్ 32 ప్రకారం.. దేశంలోని ఏ పౌరుడైనా తన ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించొచ్చనీ, కానీ.. 1991 ప్రార్థనా స్థలాల చట్టం తాము కోల్పోయిన ఆలయాలు ఇప్పించమంటూ వస్తోన్న వారి పిటీషన్లనే కోర్టు తీసుకోవటం లేదనీ, ఇది రాజ్యాంగ విరుద్ధంగాక మరేమిటని ఆయన పిటీషన్లో ప్రశ్నించారు.
వీరిద్దరి పిటీషన్లను పరిగణనలోకి తీసుకుని, నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డే, ఏ ఎస్ బోపన్నల ద్విసభ్య ధర్మాసనం 2021 మార్చి 12న భారత హోం మంత్రిత్వ శాఖకు, న్యాయశాఖకు నోటీసులు పంపి.. ‘దీనిపై మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి’ అని కోరింది.
అది భారత ప్రభుత్వ పరిశీలనలో ఉండగానే.. 2021 ఏప్రిల్ 8న వారణాసి సివిల్ కోర్టు జడ్జి అశుతోష్ తివారీ .. జ్ఞానవాపి పరిసర ప్రాంతంలో అత్యాధునిక సర్వే చేయాలంటూ భారత పురావస్తు శాఖను ఆదేశించారు. ఈ అయిదుగురు సర్వే బృందంలో ఇద్దరు హిందువులు, ఇద్దరు ముస్లింలు, పురావస్తుశాఖ వారి ప్రతినిధి ఉండాలని సూచించారు. ఈ అయిదుగురికి పైన కోర్టు ఒక పరిశీలకుడిని కూడా నియమించింది.
ఈ తీర్పును వ్యతిరేకిస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీద్ సంస్థ మళ్లీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా, 2021 సెప్టెంబరు 9న కోర్టు సర్వే మీద స్టే విధించి, ఈ కేసును సుప్రీంకోర్టు స్టే ఆరు నెలలకు పున: పరిశీలనకు అర్హమైనదేనన్న సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా దాఖలైన కేసు(2020లో దాఖలైంది)నూ దీనితో కలిపి విచారిస్తామని ప్రకటించింది.
2023 జులై 25న ఈ అంశంపైన దాఖలైన అన్ని పిటిషన్ల వాదనలనూ పరిగణనలోకి తీసుకున్న అలహాబాద్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పాడియా దీనిపై అంతిమతీర్పును 2023 ఆగస్టుకు వాయిదా వేశారు.
అయితే.. 2023 ఆగస్టులో అయిదుగురు మహిళలు జ్ఞానవాపి మసీదు గోడ బయటివైపు నేటికీ స్పష్టంగా కనిపిస్తున్న శృంగార గౌరి, గణపతి, హనుమాన్ లను ఆరాధించుకోవటానికి తమను అక్కడికి అనుమతించాలంటూ వారణాసి సివిల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో మసీదు ప్రాంతాన్ని వీడియో తీయాలంటూ కోర్టు ఆదేశించింది.
కానీ.. అంజుమన్ ఇంతెజామియా మసీద్ సంస్థ వీడియో తీయటం కుదరదంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, 2022 ఏప్రిల్ 8న కోర్టు వారి వాదనను కొట్టిపారేసింది. దీంతో ముస్లిం వర్గాలన్నీ అందోళనకు పిలుపినిచ్చాయి. అయినా.. 2022 మే 6న అనుకున్నట్లుగా సర్వే ప్రారంభించాలంటూ కోర్టు భారత పురావస్తు శాఖను ఆదేశించింది.
డిసెంబర్ 2023లోనే కోర్టుకు పురావస్తు శాఖ సర్వే రిపోర్టు అందింది. దానిని బహిర్గతం చేయాలని 11 మంది కక్షిదారులు కోరటం, కోర్టు దానిని వారికి అందిస్తూ.. దానిని లీక్ చేయకూడదని అఫిడవిట్లు తీసుకుని వారికి నివేదికను అందించటం జరిగాయి. తాజాగా ఆ నివేదకను హిందూ పక్షానికి చెందిన లాయర్ విష్ణు శంకర్ జైన్ మీడియా ముందు చదివి వినిపించటం, అందులో మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలను, రాళ్లను ఉపయోగించినట్లు సర్వేలో తేలిందని, ఆలయపు గోడలపై 34 శాసనాలు బయటపడ్డాయని ఆయన తెలపటంతో దేశవ్యాప్తంగా మరోసారి జ్ఞానవాపి చర్చకు వచ్చింది.