Election Commissioner Rajeev Kumar: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించింది. ఒడిశాలోని భువనేశ్వర్లో ఆయన లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లందరూ పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
నిష్పక్షపాతం, పారదర్శకంగా పనిచేయాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను రాజీవ్ కుమార్ ఆదేశించారు. అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండాలన్నారు. ఎన్నికల వేళ నగదు ప్రవాహం, హింసకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను పక్కాగా సీల్ చేసి, గోదాములకు తరలించి మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలన్నారు.
రాజీవ్ కుమార్ చెప్పిన మాటల ప్రకారం చూస్తే వచ్చే నెలలోనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు అర్థం అవుతోంది. ఏప్రిల్లోపు మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి మే నెలలో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దాదాపుగా ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కోసం అధికారులను సిద్ధం చేశామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈవీఎంలు అన్నింటినీ తనిఖీ చేసి.. పోలింగ్ కోసం రెడీ చేసినట్లు వెల్లడించింది.పార్లమెంట్ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ 2 ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రత విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఇప్పటికే సమీక్షలు నిర్వహించి.. సూచనలు, సలహాలు ఇచ్చామని ప్రకటించారు.