Economic Survey : ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఆర్థిక సర్వేలో కీలక అంశాలను వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2022- 23లో 7 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. 2023- 24లో ఆర్థికవ్యవస్థ వృద్ధిరేటు 6.5 శాతానికి పరిమితమవుతుందని ప్రకటించింది. పర్చేజింగ్ పవర్ ప్యారిటీ పరంగా చూస్తే ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని పేర్కొంది.
కోవిడ్ పరిస్థితుల వల్ల స్తంభించిన భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా కోలుకుందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8% వద్ద ద్రవ్యోల్బణం వ్యక్తిగత వినిమయాన్ని తగ్గించే అధిక స్థాయిలోగానీ, లేదా పెట్టుబడులను బలహీనపరిచేంత తక్కువ స్థాయిలోగానీ ఉండదని ప్రకటించింది. రుణ రేట్లు దీర్ఘకాలం అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇంకా వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉన్నందున రూపాయి మారక విలువకు సవాళ్లు ఎదురుకావొచ్చని అంచనా వేసింది. ఎగుమతుల వృద్ధి నెమ్మదించడం, కరెంటు ఖాతా లోటు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రూపాయికి ఒడుదొడుకులు తప్పకపోవచ్చని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కమొడిటీ ధరలు అధిక స్థాయిల్లో కొనసాగుతున్నందున కరెంటు ఖాతా లోటు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
దేశీయ గిరాకీ, మూలధన పెట్టుబడుల్లో పెరుగుదల భారత వృద్ధికి దోహదం చేస్తాయని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ఎగుమతుల వృద్ధి కాస్త నెమ్మదించిందని తెలిపింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి, వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదించడం ఎగుమతులపై ప్రభావం చూపాయని పేర్కొంది. స్థిరాస్తి రంగంతోపాటు నిర్మాణ కార్యకలాపాలు పుంజుకోవడంతో ఉపాధి కల్పన మెరుగైందని ప్రకటించింది. వలస కూలీలు తిరిగి పట్టణాలకు చేరడానికి ఇది దోహదం చేసిందని వివరించింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సాధారణ స్థాయిలో ఉండి, రుణ వ్యయం తక్కువగా ఉన్నట్లయితే సూక్ష్మ, చిన్న మధ్యస్థాయి పరిశ్రమల రుణాల వృద్ధి మెరుగ్గా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తం దేశంలో వేగంగా అభివృద్ధి సాధిస్తోందని విషయాన్ని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.