Paper Leak: ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. టెన్త్ ఎగ్జామ్ పేపర్ల నుంచి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ల వరకు అన్నింటిని లీక్ చేస్తున్నారు. ఇటు తెలంగాణలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం కలకలం రేపుతుంటే.. ఆస్సాంలో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సోమవారం జరగాల్సిన జనరల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఆదివారం లీక్ అయింది. వెంటనే గుర్తించిన అధికారులు ఎగ్జామ్ను రద్దు చేశారు.
ఈ వ్యవహారంలో 12 మంది విద్యార్థులతో పాటు మరో 27 మందిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో ఇద్దరు టీచర్లను ప్రధాన సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. లుహిత్ ఖబాలు హైస్కూల్ ప్రిన్సిపల్ ప్రణబ్ దత్తా, లఖింపూర్లోని డప్లకటా హైస్కూల్లో టీచర్గా పనిచేస్తున్న కుముద్ రాజ్ఖోవా పేపర్ను లీక్ చేసినట్లు గుర్తించారు.
ప్రణబ్ దత్తాను అదుపులోకి తీసుకోగా.. కుముద్ రాజ్ఖోవా పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ప్రణబ్ దత్తా ఇంటి నుంచి కాలిబూదిదైన పేపర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందిదులు ప్రశ్నాపత్రం ఇచ్చేందుకు ఒక్కొక్కరి నుంచి రూ. 300 నుంచి రూ. 3 వేలు వసూల్ చేశారని వెల్లడించారు.