Manipur : మణిపూర్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు చల్లారలేదు. తాజాగా సైన్యం 12 మంది మిలిటెంట్లను అదుపులోకి తీసుకుంది. అయితే తూర్పు ఇంఫాల్లోని ఇథం గ్రామంలో దాదాపు 1,500 మంది మహిళలు భద్రతా బలగాలను చుట్టుముట్టారు. పౌరుల భద్రత నేపథ్యంలో మిలిటెంట్లను సైన్యం విడిచిపెట్టింది.
నిఘావర్గాల సమాచారంతో ఇంథ గ్రామంలో సైన్యం గాలింపులు చేపట్టింది. 12 మంది మిలిటెంట్లను పట్టుకుంది. మైతేయ్ మిలిటెంట్ గ్రూపు కేవైకేఎల్కు చెందినవారీగా గుర్తించింది. 2015లో 6 డోగ్రా యూనిట్పై జరిగిన దాడిలో వీరి ప్రమేయం ఉందని ఆర్మీ వెల్లడించింది.ఇ లా అనేక దుశ్చర్యల్లో ఈ మిలిటెంట్ల హస్తం ఉందని తెలిపింది. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
మిలిటెంట్లను అదుపులోకి తీసుకున్న విషయం తెలియగానే గ్రామస్థులు సైన్యాన్ని చుట్టుముట్టారు. ఇందులో దాదాపు 1,500 మంది మహిళలు ఉన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని సైన్యం వారిని కోరినా వారు పట్టించుకోలేదు. చివరకు సైన్యం మిలిటెంట్లను విడుదల చేసింది. ప్రాణనష్టాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్మీ అధికారులు ప్రకటించారు.
మణిపూర్ లో అల్లర్లు చెలరేగుతుంటే ప్రధాని మోదీ మౌనంగా కూర్చున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేష్ విమర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అల్లర్లను నియంత్రించలేకపోయారని మండిపడ్డారు. మణిపూర్లో శాంతి అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో జైరాం రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మణిపూర్లో హింస అదుపులోకి వచ్చిందని ఆ రాష్ట్ర సీఎం బీరేన్సింగ్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలిపారు. ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయిన బీరేన్ సింగ్..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషితో పరిస్థితులు చాలావరకు మెరుగుపడ్డాయని తెలిపారు. మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని అమిత్ షా భరోసా ఇచ్చారు.