Ayodhya : శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని అయోధ్య నగరం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పది లక్షల దీపాలతో అలంకరించనున్నట్లు రామజన్మభూమి ట్రస్టు సభ్యులు తెలిపారు. అందుకోసం దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలనే వినియోగించనున్నట్లు ప్రకటించారు. అయోధ్యలోని ముఖ్యనగరాలు అయిన రామ మందిరం సహా రామ్ కీ పైడీ, సరయు ఘాట్, కనక్ భవన్, గుప్తర్ ఘాట్, మనిరామ్ దాస్ చవానీ, లతా మంగేష్కర్ చౌక్ వంటి ప్రముఖ ప్రదేశాలన్నింటినీ దీపాలతో అలంకరిస్తామని వెల్లడించారు.
శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సోమవారం సాయంత్రం తమ ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో దీపాలు వెలిగించాలని ఇప్పటికే ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అయోధ్యలో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం గత ఏడేళ్లుగా దీపోత్సవం నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో 1.71 లక్షల దీపాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2023లో రికార్డు స్థాయిలో అది 22.23 లక్షలకు చేరింది. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జనవరి 22న ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
.
.