Himachal Pradesh : భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్నాయి. కుంభవృష్టితో జలవిలయం సంభవించింది. శిమ్లాలోని ఓ ఆలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 9 మంది మృత్యువాతపడ్డారు.
సమ్మర్ హిల్ ప్రాంతంలో ఈ శివాలయం ఉంది. కొండచరియలు విరిగిపడటంతో ఆలయం కుప్పకూలింది. దీంతో చాలామంది భక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే రంగంలోకి సహాయక చర్యలు చేపట్టారు. 9 మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల కింద మరో 20 మంది ఉన్నారని గుర్తించారు.
ఉత్తరాదిలో శ్రావణ సోమవారం కావడంతో ఉదయం నుంచే శివాలయానికి భారీగా భక్తులు పోటెత్తారు. ప్రమాద సమయంలో ఆలయం వద్ద 50 మంది ఉన్నారని అధికారులు అంటున్నారు. ఆలయం కూలిన ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సఖ్వీందర్ సింగ్ సుఖు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిథిలాలను తొలగించి బాధితులను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోందని తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల వల్ల 24 గంటల వ్యవధిలోనే 16 మంది మరణించారు. ఆదివారం సోలన్ జిల్లాలోని జాదోన్ గ్రామంలో కుంభవృష్టికి ఏడుగురు బలయ్యారు. గత 24 గంటల్లో శిమ్లాలో 131.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఇప్పటికే స్కూళ్లకు సెలవు ఇచ్చింది. భారీ వర్షాలు, కొండచరియల విరిగిపడిన కారణంగా రాష్ట్రంలో 750 రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు వణికించాయి. ఈ సీజన్లో వర్షాల వల్ల రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. ఇప్పటి వరకు 250 మందికి ప్రాణాలు కోల్పోయారు.