Raja Chari : అమెరికా ఎయిర్ఫోర్స్కి ఎంపిక కావడమే చాలా కష్టం. యూఎస్ ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ వన్ స్టార్ జనరల్ ఆఫీసర్ ర్యాంక్ హోదా దక్కడమంటే అషామాషీకాదు. దీని తర్వాత మేజర్ జనరల్ హోదా దక్కుతుంది. అలాంటి కీలక పదవి తెలుగు వ్యక్తి రాజాచారికి దక్కబోతోంది.
అమెరికా ఎయిర్ఫోర్స్లో బ్రిగేడియర్ జనరల్ గ్రేడ్ పదవికి రాజాచారిని అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. ఈ విషయాన్ని యూఎస్ రక్షణశాఖ ప్రకటించింది. అయితే ఈ నామినేషన్ను సెనేట్ ఆమోదించాల్సి ఉంది. 45 ఏళ్ల రాజా చారి ప్రస్తుతం అమెరికా వైమానిక దళంలో కల్నల్ హోదాలో ఉన్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో వ్యోమగామిగా, క్రూ-3 కమాండర్గా విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది అంతరిక్షయానం చేశారు.
ఎవరీ రాజాచారి ..?
రాజాచారి తండ్రి శ్రీనివాస్ వి.చారి హైదరాబాద్కు చెందిన వ్యక్తి. ఉన్నత విద్య, ఉద్యోగం కోసం అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అమెరికన్ పెగ్గీ ఎగ్బర్ట్ను వివాహం చేసుకున్నారు. వీరికి రాజాచారి 1977లో జన్మించారు. స్కాన్సిన్లోని మిల్వాకీలో రాజాచారి ప్రాథమిక విద్య పూర్తి చేశారు. యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ చదివారు. ఆ తర్వాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు. యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్లోనూ విద్యనభ్యసించారు.
రాజాచారి 2017లో నాసా ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాస్కు ఎంపికయ్యారు. 2021లో నాసా, స్పేస్ఎక్స్ సంయుక్తంగా ప్రయోగించిన ‘క్రూ-3’ మిషన్లో రాజాచారి సభ్యుడిగా ఉన్నారు. ఫాల్కన్ -9 రాకెట్లో నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ మిషన్కు రాజాచారి కమాండర్గా వ్యవహరించారు. కొన్ని నెలల పాటు ఈ బృందం అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేసింది. గతేడాది మే నెలలో భూమిపైకి తిరిగొచ్చింది.
చందమామపై అన్వేషణ కొనసాగించడానికి చేపడుతున్న ప్రతిష్ఠాత్మక ‘ఆర్టెమిస్’ మిషన్ కోసం నాసా 18 మంది వ్యోమగాములను ఎంపిక చేసింది. అందులో రాజాచారికి చోటు దక్కింది. 2024లో రాజాచారి జాబిల్లిపై కాలుమోపే అవకాశాలున్నాయి. ఇలా తెలుగు మూలాలున్న ఓ వ్యక్తి అమెరికాలో తనదైన ప్రతిభ చూపిస్తూ దూసుకెళుతున్నారు.