Tamilisai Soundararajan rejoined to bjp (today’s latest news): తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందర రాజన్ మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తిరిగి సొంతగూటికి చేరారు. చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీలో చేరిపోయారు. తమిళిసైకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కాషాయ కండువా కప్పారు.
గతంలో తమిళిసై బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు. అయితే తమిళిసై ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.
తమిళనాడులో బలపడేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. బలమైన నేతలను లోక్ సభ ఎన్నికల బరిలో దింపాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే తమిళిసైని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చింది.
తన రాజకీయ రీఎంట్రీ పై తమిళిసై స్పందించారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజా సేవ చేయాలన్న లక్ష్యంతో తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాయనని స్పష్టం చేశారు.
Also Read: తొలివిడత ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల.. నామినేషన్లు షురూ
తమిళిసై తిరిగి బీజేపీలో చేరడంపై ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై హర్షం వ్యక్తం చేశారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే 400 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు.