Tejas jets : తేజస్ యుద్ధవిమానాలు భారత్ అమ్ములపొదిలో కీలక అస్త్రాలుగా మారనున్నాయి. ఈ జెట్స్ ను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ విమానాలను భారత వైమానిక దళం జమ్మూకాశ్మీర్కు తరలించింది. ఇవి పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలోని లోయల్లో గగనవిహార చేయనున్నాయి.ఫైటర్ పైలట్లకు ఆ ప్రాంతంలో తిరగడంపై అనుభవం వస్తుందని అధికార వర్గాలు వివరించాయి. ప్రస్తుతం ఈ యుద్ధవిమానాలు నింగిలో కార్యకలాపాలు సాగిస్తున్నాయని వివరించాయి. జమ్మూకాశ్మీర్లో భారత వైమానిక దళానికి అనేక స్థావరాలున్నాయి. చైనా, పాకిస్థాన్ ను ఎదుర్కోవడానికి ఈ స్థావరాలు కీలకం కానున్నాయి.
మరోవైపు లద్ధాఖ్కు భారత వైమానిక దళం యుద్ధ విమానాలను తరలిస్తోంది. అక్కడి ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల్లో గగనవిహార అనుభవాన్ని ఈ యుద్ధవిమానాల పైలట్లకు వచ్చేలా చేస్తున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేజస్కు వైమానిక దళం ఎంతో ప్రాధాన్యతనిస్తోంది.
తేజస్ విమానాలకు దశలవారీగా కొత్త సామర్థ్యాలను జోడిస్తున్నారు. వాయుసేన ఇప్పటికే రెండు తేజస్ స్క్వాడ్రన్లను ప్రవేశపెట్టింది. తేజస్ స్క్వాడ్రన్ లను మరింత మెరుగుపరచి రూపొందించే 83 మార్క్ 1ఎ జెట్ల సరఫరా కోసం ఒప్పందాలు కుదిరాయి. కొన్నేళ్లలో అవి వైమానిక దళానికి అందుబాటులోకి రానున్నాయి.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ.. DRDO అభివృద్ధి చేస్తున్న తేజస్ మార్క్- 2, ఏఎంసీఏలపైనా వాయుసేన దృష్టి సారించింది. తేజస్ యుద్ధ విమానాలు పాకిస్థాన్, చైనా సంయుక్తంగా అభివృద్ధి చేసిన జేఎఫ్-17 జెట్ల కంటే మెరుగ్గా పనిచేస్తున్నాయని తేలింది.